Devji | కోరుట్ల, జూన్ 11: మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన తిరుపతి 1983-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయన విప్లవ భావజాలానికి ఆకర్షితులై రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్గా పనిచేశారు. అదే కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పేపర్ ను ఆయన బాయికట్ చేశారు.
మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ తెలుగు సెకండియర్ పరీక్ష మాత్రం మిగిలిపోయింది. ఇటీవల మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జన జీవనంలోకి అడుగిడిన దేవ్ జీ, అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తి చేయాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. మే 13న మాస్ట్రో జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. గురువారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఆయన రాసిన తెలుగు పేపర్ లో 72 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 614 మార్కులతో ఇంటర్మీడియట్ లో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. 45 ఏళ్ల తర్వాత పరీక్షలు రాసిన దేవ్ జీ ఇటీవల లా సెట్ లోనూ సత్తా చాటారు. ప్రతిభకు వయసు అడ్డు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని దేవ్ జీ నిరూపించారు.