కరీంనగర్ కార్పొరేషన్, మే 12 : బాలికపై లైంగికదాడి చేసినట్టు అభియోగం వస్తేనే అరెస్ట్లు చేస్తారని, అలాంటిది బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇన్ని ఆధారాలు వస్తున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగారు. సిట్ పేరిట కేసును నీరుగార్చే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని, మోదీ సభలో వారి నవ్వులే నిదర్శనమని చెప్పారు. రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కార్యకర్త అని విమర్శించారు. సంజయ్కి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతుల అవస్థల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే భగీరథ్ను అరెస్టు చేయకుండా తాత్సరం చేస్తున్నారని మండిపడ్డారు.
కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగీరథ్ను అరెస్ట్ చేయకుండా సిట్ ఎందుకు వేశారో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. సిట్ పేరిట తప్పించే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ మాటలు రాముడిగా.. చేతలు మాత్రం రావణుడిగా ఉన్నాయని ఆరోపించారు. ఇంకా ఎన్ని రోజులు ‘జై శ్రీరామ్’ పేరుతో ప్రజల్ని మోసం చేస్తావని నిలదీశారు. ఇతరులను విమర్శించే ముందు తమ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. రౌడీయిజం, అధికార బెదిరింపులు, డబ్బులతో కొనాలంటే అన్ని జరగవనే విషయాన్ని సంజయ్ తెలుసుకోవాలని సూచించారు. ధర్మం అంటూ గొంతెత్తిన వారంతా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మిగిలిన పార్టీల నాయకులు, మహిళా మంత్రులు, మహిళా కమిషన్ సభ్యులు ఎక్కడ పోయారని, ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి అరెస్ట్ట్ చేయాలని డిమాండ్చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్, బీఆర్ఎస్ నాయకులు చీటి రాజేందర్రావు, షౌకత్, యాదగిరి, సురేశ్, మోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఒక కేంద్ర మంత్రి కొడుకు ఎలా పరారీలో ఉంటడు? ఐబీ, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నయ్? పొక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా భగీరథ్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. రేవంత్రెడ్డి, సంజయ్ సహకారం వల్లనేనా? పోక్సో కేసుల్లో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి. కానీ, పోలీసులు నమోదు చేసిన కేసుపైనే విచారణాధికారిగా మరొకరిని నియమించడం ఏంటి? ఈ కేసును ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి. రాష్ట్రంలో పోక్సో కింద అనేక కేసులు నమోదువుతున్నయి. మరి వాటన్నింటికీ సిట్ ఎందుకు వేయడం లేదు. సంజయ్ కొడుకు కావడం వల్లే సిట్ వేసి తప్పించే ప్రయత్నం చేస్తున్నరు. పోక్సో సెక్షన్ 19 కింద విషయం తెలిసి దాచిన వారిని కూడా నిందితులుగా చేర్చాలి. ఈ కేసులో సంజయ్ విషయం తెలిసి పక్కదారి పట్టించే యత్నం చేశారు. ఆయనతోపాటు మరొకరు కూడా ఉన్నరు. వీరిని కూడా నిందితుల జాబితాలో చేర్చాలి. మోడీ సభలో బండి సంజయ్ కేసీఆర్ను పరోక్షంగా విమర్శించిండు. ఈ కేసుకు కేసీఆర్కు ఏం సంబంధం? ఓవైపు తప్పు పనిచేసిన కొడుకును సిగ్గులేకుండా తప్పుదారి పట్టించే యత్నం చేస్తూ కేసీఆర్నే విమర్శిస్తావా..? ఇకపై కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదు. సంజయ్ నీ దొంగ ఏడుపులు బంద్ చెయ్. నిజాయితీ ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి నిరూపించుకో.