కరీంనగర్: స్టాల్ను ప్రారంభిస్తున్నమంత్రి గంగుల కమలాకర్, చిత్రంలో మేయర్ సునీల్రావు, నమస్తే తెలంగాణ అడ్వటైజ్ మెంట్ జీఎం సురేందర్రావు, బ్రాంచ్ మేనేజర్ ప్రకాశ్రావు
కరీంనగర్ కార్పొరేషన్/కమాన్ చౌరస్తా, నవంబర్ 26 : రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దామని, హైదరాబాద్ తర్వాత ఇక్కడే రియల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పరిపాలనలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, పటిష్టమైన శాంతిభద్రతలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని అనేక పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. నాణ్యమైన కరెంటు, పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ విధానాల కారణంగా బడా బడా కంపెనీలు ముందుగా రాష్ట్రం వైపే చూస్తున్నాయన్నారు.
కరీంనగర్ చరిత్రలో మొదటిసారి ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. ఇలాంటి షోలను ప్రతి నెలలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని, వీటి వల్ల ప్రజలకు ఎంతో సమాచారం అందడంతోపాటు లాభం జరుగుతుందన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలందరూ తెలంగాణలో ఇండ్లు, స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇళ్ల కొనుగోలు, కొత్త వెంచర్లు, భవన నిర్మాణాలు చేసేందుకు సంస్థల నిర్వాహకులు, ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్లో ఇప్పుడు న్యూయార్క్ తరహాలో అభివృద్ధి కనిపిస్తున్నదని, అందుకే కార్పొరేట్ కంపెనీలు దేశంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా హైదరాబాద్నే ఎంచుకుంటున్నాయన్నారు. ఆరేళ్లలోనే ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. గతంలో కరెంటు లేకపోవడం వల్ల అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించలేదన్నారు. దీని వల్ల ఇక్కడ ఉపాధి లేక ప్రజలు వలసలు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యాపారులు పరిశ్రమలను నెలకొల్పడానికి అనుమతులు ఇచ్చేందుకు ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణకే దక్కిందన్నారు.
ఈ పథకంలో నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోకపోతే అనుమతులు వచ్చినట్లే అని చెప్పడంతో ప్రపంచంలోని అనేక కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. పెరుగుతున్న హైదరాబాద్ సంపదను రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. భూముల్లో ఎలాంటి వివాదాలు చోటుచేసుకోవద్దన్న ఆలోచనతో ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని, దీంతో 90 శాతం మేర భూ వివాదాలు లేకుండా పోయన్నారు. గతంలో శాంతిభద్రతలు, భూ సమస్యల వివాదాలు వల్ల చాలా ఇబ్బంది వచ్చేదని, కరీంనగర్కు రియల్ సంస్థలు ఇక్కడికి వచ్చేవి కావని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు కరీంనగర్ను అద్భుతంగా అభివృద్ధి చేయడంతోపాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జి, మెడికల్ కళాశాలలను తీసుకురావడంతో అనేక ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయన్నారు.
ప్రజలు భూములను కొనే సమయంలో భద్రత ఉండాలని, ఇది తన ఆస్తి అని చెప్పుకునే విధంగా నమ్మకం ఉండాలని, ఆ విధంగా ప్రభుత్వం పరిస్థితులు కల్పించిందన్నారు. బ్యాంకులు కూడా ఇళ్ల రుణాల మంజూరు సులభంగా జరిగేలా చూడాలని సూచించారు. నూతన వెంచర్లను నిబంధనల మేరకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పారు. కరీంనగర్లో భూ వివాదాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, కార్పొరేటర్లు వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, దిండిగాల మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, నాంపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, వాసాల రమేశ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ముందంజలో కరీంనగర్
గొప్పగా అభివృద్ధి చెందిన నగరాల్లో కరీంనగర్ ముందంజలో ఉన్నది. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. నగర విస్తీర్ణం పెరగడం, సీఎం కేసీఆర్కు నగరంపై ఉన్న ప్రేమతో స్మార్ట్సిటీ పథకానికి ఎంపిక కావడం, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరవడమే ప్రధాన కారణం. వీటితో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ ఎంతో ఆకర్షణీయమైన ప్రాజెక్టు. మా పాలకవర్గం వచ్చిన రెండున్నరేళ్లలో 500 కోట్ల నుంచి 600 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం. ఇది నేను గర్వంగా చెబుతున్నా. మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయి. ఆరేళ్ల క్రితం చూసిన వారు ఇప్పుడు చూసి ఎంతో మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోకుండా రియల్ వ్యాపారం పెరుగుతున్నది. ఈ ప్రాపర్టీ షో ఇక్కడి అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.
– యాదగిరి సునీల్రావు, కరీంనగర్ మేయర్
అనుమతులు ఉన్నవే కొనాలి
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో అనుమతులు ఉన్న వాటిలోనే ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేయాలి. వ్యాపారులు కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుడా నుంచి అనుమతులు తీసుకోవాలి. సుడా కూడా సులువుగానే తొందరగా అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయటం వల్ల అటు ప్రజలు, ఇటు వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భూ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరేళ్ల కిత్రం కరీంనగర్ చూసిన వారు ఇప్పుడు చూస్తే మహానగరానికి వచ్చినట్లే ఉంటుంది. అంతగా మార్పు చెందింది. సుడా అనుమతులు తీసుకోవడం ద్వారా వస్తున్న నిధులతో సుడా పరిధిలోని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– జీవీ రామకృష్ణారావు, సుడా చైర్మన్
అత్యంత వేగంగా కరీంనగర్ డెవలప్మెంట్
హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ఆలోచన, టీఎస్ బీపాస్ వంటి కార్యక్రమాలు అభివృద్ధిలో నడిపించేందుకు చోదక శక్తులుగా పని చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్లో మాత్రమే విల్లా అనేవి చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు కరీంనగర్లోనూ ఈ సంస్కృతి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంతో వ్యాపారాలు సాగుతున్నాయి. హైదరాబాద్లోని ప్రాంతాల్లో కనిపించే గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసే సదుపాయాలన్నీ ఇప్పుడు కరీంనగర్లోనూ ఏర్పాటు చేసేందుకు రియల్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఒక ఆస్తి కొనుగోలు చేసే సమయంలో అనేక విషయాలపై ప్రజలు ఆలోచనలు చేస్తారు. అలాంటి ఆలోచనలకు సంబంధించిన అన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశాం. మాపై నమ్మకం ఉంచి ఇందులో పాల్గొంటున్న సంస్థలన్నింటికీ కృతజ్ఞతలు.
– ఎన్ సురేందర్రావు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అడ్వటైజ్మెంట్ జనరల్ మేనేజర్
పోటాపోటీగా అభివృద్ధి
హైదరాబాద్ తర్వాత కరీంనగర్, వరంగల్ పోటాపోటీగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర రాజధానికి తక్కువ సమయంలోనే వెళ్లి వచ్చే విధంగా కరీంనగర్ మంచి రోడ్డు మార్గం ఉన్నది. అలాగే, ఈ నగరానికి ఎంతో చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఇక్కడికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు జీవించేలా వాతావరణం ఉన్నది. రియల్ సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత శాంతిభద్రతలకు ఇబ్బంది లేదు. మాకు ప్రస్తుతం ఎక్కువగా సైబర్ నేరాలు, ఆస్తి తగాదాలు, మహిళ ఇబ్బందులకు సంబంధించి కేసులు మాత్రమే వస్తున్నాయి. పోలీసుల నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తాం. కొనుగోలుదారులు, అమ్మకందారులు సుడా, రెవెన్యూ నిబంధనల మేరకు క్రయ, విక్రయాలు చేస్తే ఇబ్బందులు ఉండవు.
– వీ సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్