Maha Shivaratri | మహాశివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న క్షేత్రంలో జాతర వేడుకలు శుక్రవారమే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండగా, ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మొదటి రోజే 50వేలకుపైగా దర్శించుకోగా, వీధులన్నీ సందడిగా మారాయి. రాత్రి ‘శివార్చన’ పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేటి ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి దేవాదాయశాఖ మంత్రి ఐకేరెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. ఎప్పట్లాగే ఈ సారి కూడా వేములవాడకు వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
వేములవాడ/ వేములవాడ టౌన్, ఫిబ్రవరి 17: మహా శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జాతర ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచి తాకిడి అంతంతే ఉన్నా రాత్రి వరకు 50వేల మందికిపైగా రాజన్నను దర్శించుకున్నారు. ఆదివారం వరకు ఆలయంలో ఆర్జితసేవలను రద్దు చేశారు. కాగా, 41 రోజులు కఠోర నియమాలతో శివదీక్ష చేసిన శివదీక్షాపరులకు శనివారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఉత్సవాల సమయంలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 14 ఉచిత బస్సులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ఎమ్మెల్యే రమేశ్బాబు ప్రారంభించారు. వీటి ద్వారా తిప్పాపురం, కోరుట్ల బస్టాండ్ల నుంచి భక్తులను ఉచితంగా ఆలయ పార్కింగ్స్థలం దాకా తీసుకురానున్నారు. ఈ సారి కూడా వేములవాడకు వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆలయ చెరువు ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.
జాతర సందర్భంగా గుడి చెరువులో ‘శివార్చన’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు శివతాండవం, పేరిణి, భరత నాట్యం, కూచిపూడి, కథాకళి, బోనాల కోలాటం, శివానందలహరి, ఒగ్గుడోలు విన్యాసం, డప్పు విన్యాసాలతో భక్తులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్, జిల్లా ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, ఈవో కృష్ణప్రసాద్, డీఎస్పీ నాగేంద్రాచారి, సెస్ డైరెక్టర్ ఉమ తిలకించారు.
ఏటా రాష్ట్రప్రభుత్వం తరఫున రాజన్నకు పట్టు వస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. శనివారం స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. ఇందుకుగాను శుక్రవారం రాత్రే మంత్రి అల్లోల వేములవాడకు చేరుకున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
రాజన్న ఆలయంలో శనివారం ఉదయం నుంచీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా అర్చకులు, అనువంశిక అర్చక కుటుంబాల వారితో మహాలింగార్చన నిర్వహించనున్నారు. పట్టణంలోని బ్రాహ్మణులు, ఆలయ అర్చకులు ఈ లింగార్చనలో పాల్గొంటారు. దాదాపు 3 గంటలపాటు నిర్వహించే కార్యక్రమంతో ఆలయ పరిసరాలు వేదఘోషతో మార్మోగుతాయి. రాత్రి 11:30 గంటల నుంచి ఆలయ గర్భగుడి ముందు 11 మంది రుత్వికులతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్ తెలిపారు.
గడిచిన ఎనిమిదేళ్లలో నియోజకవర్గంలోని అనేక చిన్న ఆలయాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దాదాపు 30కోట్లు కేటాయించారు. ఈ ప్రాంతంలో అనేక మంది కవులు, కళాకారులు జన్మించారు. సీ నారాయణ రెడ్డి, మిద్దె రాములు లాంటివా రు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆరేళ్లుగా రాజన్న క్షేత్రంలో శివార్చన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నాం.
– వేములవాడ ఎమ్మెల్యే
మహా శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు పెంబట్ల దుబ్బ రాజేశ్వర దేవాలయం, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయం, కోటిలింగాల, ఓదెల మల్లన్న, జనగామ త్రిలింగేశ్వరాలయం, కరీంనగర్లోని పాతబజారు శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయాచోట్ల ఆలయాలన్నీ విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీననున్నాయి.
జాతరకు వచ్చే భక్తుల కోసం రాజన్న ఆలయం ఆధ్వర్యంలో చెరువు మైదాన ప్రాంతంలో ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఈవో కృష్ణప్రసాద్, సెస్ డైరెక్టర్ నామాల ఉమతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ప్రారంభించారు. మూడు రోజులపాటు శిబిరం నిర్వహిస్తుండగా, శనివారం మహాశివరాత్రి సందర్భంగా అల్పాహారమే అందుబాటులో ఉంటుందని, ఆదివారం అన్నదానం కొనసాగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే రమేశ్బాబు ప్రారంభించారు.
రాజన్న ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం. ఈ క్షేత్రం నుంచి సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నా. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. ఆయన స్వయంగా గుడిచెరువులో తిరిగి, సూచించిన మేరకు 35ఎకరాల స్థలం సేకరించడంతో ఆలయ అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇటీవలే రూ. 50కోట్లు కూడా కేటాయించారు. మంత్రి కేటీఆర్తో కలిసి అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాం. ఈ సారి మహాశివరాత్రి వేడుకలకు సుమారు నాలుగు లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశాం. జాతర విజయవంతానికి అధికారులందరూ కృషి చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. పోలీస్ బందోబస్తు పటిష్టంగా చేపట్టాలి.
– శివార్చన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి