Chigurumamidi | చిగురుమామిడి, జులై 16 : రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, ఏఈవోలు అఖిల, సౌమ్య, ప్రణయ్, సతీష్, ఎండీ ఖలీల్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ, కొండాపూర్, ముదిమాణిక్యం, గునుకుల పల్లె, పీచుపల్లి గ్రామాల్లో గ్రామ సర్పంచులు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగం గల మొక్కజొన్న, పల్లి, పెసర, మినుములు, కంది, కూరగాయల పంటల సాగు చేసుకోవాలని రైతుకు సూచించారు.
అలాగే ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ పంట సాగుపై ఆసక్తిగల రైతులు సంబంధిత ఏఈఓ ల వద్ద పేరు నమోదు చేసుకోవాలన్నారు. రైతులకు పంటల సాగుపై ఏమైనా అపోహలు ఉన్నట్లయితే సంబంధిత ఏఈఓ లను సమస్యలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. పంటలకు సేంద్రియ ఎరువులను వాడితే పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ పేడ్ మేనేజర్ రోహిత్, సర్పంచులు అల్లెపు సంపత్, మార్క రాజ్ కుమార్, బోయిని రమేష్, గునుకుల మధుసూదన్ రెడ్డి, పీచు సత్యనారాయణ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.