Vemulavada | వేములవాడ, జూలై 23 : వేములవాడ పట్టణంలోని మహనీయుల విగ్రహాలు, ముఖ్య కూడళ్లు, సూచిక బోర్డుల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని పురపాలక సంఘం నిషేధం విధించింది. అయితే వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్, కోరుట్ల బస్టాండ్, మల్లారం నంది జంక్షన్, మూలవాగు వంతెన అమరవీరుల స్థూపం, జగిత్యాల బస్టాండ్ ప్రాంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా రోజుల తరబడి ఉండిపోతున్నాయి. మహనీయుల విగ్రహాలు కనిపించకుండా పోగా రహదారులు కూడా కనిపించకుండా పెడుతున్న ఫ్లెక్సీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో ఇక ప్రధాన రహదారుల్లో సూచిక బోర్డులు కూడా కనిపించకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా అటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వేములవాడ పురపాలక సంఘం కౌన్సిల్ మహనీయుల విగ్రహాల కూడళ్లు, మూలమలుపుల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని తీర్మానించారు. ప్రమాదాల నియంత్రణతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి అమలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఇందులో భాగంగానే గురువారం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను తొలగించగా పట్టణ పరిసరాల్లో ఉన్న అన్ని ఫ్లెక్సీలను కూడా తొలగిస్తామని ఆయన తెలిపారు.