పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొన్నది. 14 మండలాలకు గానూ ఐదుగురు ఇన్చార్జి ఎంఈవోలు ఉండగా.. ఆపై అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లకే ఫుల్ అడిషనల్ చార్జి ఇస్తుండడం, దూరంగా ఉండే మండలాలు కేటాయిస్తుండడంతో చదువు గాడితప్పుతున్నది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతోనే అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శిస్తున్నారు.
పెద్దపల్లి, మార్చి 27(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో 14 మండలాల విద్యాశాఖ అధికారుల బాధ్యతలను ఆరుగురు జడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించారు. ధర్మారం హెచ్ఎం చాయాదేవికి కేవలం ధర్మారం.. మంథని మండలం గుంజపడుగు హెచ్ఎం లక్ష్మికి మంథని, ముత్తారం.. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి హెచ్ఎం కవితకు ఎలిగేడు, జూలపల్లి మండల విద్యాధికారులుగా ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) బాధ్యతలను ఇచ్చారు. కమాన్పూర్ హెచ్ఎం సంపత్రావు కమాన్పూర్, రామగిరి, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం.. పెద్దపల్లి హెచ్ఎం సురేందర్ కుమార్ పెద్దపల్లి, సుల్తానాబాద్, శ్రీరాంపూర్.. సుల్తానాబాద్ మండలం కనుకుల హెచ్ఎం రాజయ్య ఓదెల మండల ఇన్చార్జిగా ఉన్నారు.
కాగా, కమాన్పూర్ ఎంఈవోగా ఉన్న సంపత్రావు ఈ నెల 31 రిటైర్డ్ కానుండగా, ఆయన పరిధిలోని కమాన్పూర్, రామగిరి మండలాలను పెద్దపల్లి ఎంఈవోగా కొనసాగుతున్న సురేందర్ కుమార్కు కేటాయించారు. మిగిలిన రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలను ఓదెల ఎంఈవో రాజయ్యకు కేటాయించారు. అయితే ఇన్చార్జిల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే ఇన్చార్జిలుగా ఉన్న ఎంఈవోలకు పక్కన ఉండే మండలాలకు కాకుండా దూరంలో ఉండే మండలాల బాధ్యతలను కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఉదాహరణకు చూస్తే రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలను పక్కనే ఉన్న మంథని, పెద్దపల్లి ఎంఈవోలకు ఇవ్వకుండా దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓదెల ఎంఈవోకు ఇచ్చారు. అలాగే సుల్తానాబాద్ మండలం నుంచి ఇన్చార్జి ఎంఈవోలుగా ఉన్న ఇద్దరు హెచ్ఎంలకు.. సుల్తానాబాద్ మండలం కేటాయించకుండా, పెద్దపల్లి ఇన్చార్జి ఎంఈవోకు బాధ్యతలు కేటాయించారు. ఇలా ఇష్టారాజ్యంగా కేటాయించడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతున్నది. దూరభారంతో సమయం కూడా వృథా అవుతున్నది. దీంతో ఎటూ న్యాయం చేయలేని పరిస్థితి ఉంటున్నది.
ప్రభుత్వ నిబంధనల మేరకే ఎంఈవోలకు బాధ్యతలు ఇచ్చాం. గతంలో జూలపల్లిలో హెచ్ఎంగా పనిచేసిన కవిత సుల్తానాబాద్ మండలానికి వచ్చింది. ఆమె సుల్తానాబాద్లో పనిచేస్తూ జూలపల్లి, ఎలిగేడు మండలాలను చూడాల్సి వస్తున్నది. ఇప్పుడు అది మార్చేందుకు వీలు లేదు. అలాగే మంథని ఎంఈవోకు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అదనంగా సమీప మండలాలను ఇవ్వలేదు. పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్ కొత్తగా మండలాలను తీసుకునేందుకు విల్లింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే బాధ్యతల కేటాయింపులో ఎదురైన సమస్యలు పరిష్కరిస్తాం.
-మాధవి, డీఈవో (పెద్దపల్లి)