మల్లాపూర్/ ఎల్లారెడ్డిపేట, జూన్ 12: చెట్లను నరికివేసినందుకు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల జరిమానాలు వేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో ప్రధాన రహదారి పక్కన ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలోని పది చెట్లను నరికిన నడ్పిరెడ్డికి రూ.5 వేల జరిమానా విధించారు. కార్యదర్శి మోహన్ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫైన్ విధించి రసీదును అందజేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీలో నాలుగు చెట్లను నరికిన వ్యక్తికి ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున కార్యదర్శి బొల్లారపు కృష్ణ రూ.2000 జరిమానా విధించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా విచక్షణా రహితంగా చెట్లను నరికి వేశారు. దీంతో కాలనీవాసులు కొందరు అసహనం వ్యక్తం చేయడం, అది కాస్తా సోషల్మీడియాలో వైరల్ కావడంతో చెట్లను నరికిన వారికి జరిమానా విధించారు. అలాగే, వాటి స్థానంలో పూలమొక్కలు పెట్టాలని సూచించారు. అనుమతి లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు తప్పవని సర్పంచ్ ఎన్గందుల నర్సింలు హెచ్చరించారు.