సిద్దిపేట, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలుగా ఉండేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాం తానికి గోదావరి నీళ్లు, రెవెన్యూ డివిజన్, డీఎస్పీ ఆఫీసు, మున్సిపాలిటీ, అక్కన్నపేట మండలం కావాలని, ఇట్లా ఎన్నో నినాదాలు ఉండేవన్నారు. వాటన్నింటిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నిజం చేశారన్నారు. ఆదివారం హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
గత శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ గడ్డ నుంచి ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి ఘన విజయం సాధించారన్నారు. ఈసారి కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. సీఎం కేసీఆర్కు హుస్నాబాద్ అంటే ప్రేమ, నమ్మకం, గురి, ఈ మట్టికి అంత మహిమ ఉంది అని, హుస్నాబాద్ ప్రజలకు అంత గొప్పతనం దక్కిందన్నారు. ఎల్లమ్మ తల్లి దయతో తప్పకుండా ఈ ఎన్నికల్లో సెంచరీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఉప్పొంగి పొతున్నాయి..
సీఎం కేసీఆర్ మేనిఫెస్టో చూసి రాష్ట్రంలోని ప్రజల అందరి హృదయాలు ఉప్పొంగి పొతున్నాయన్నారు. కేసీఆర్ ఏ మాట ఇచ్చిన తప్పకుండా దానిని అమలు చేస్తాడనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. హుస్నాబాద్ ప్రాంతం ఒకనాడు ఇది కరువు పీడిత ప్రాంతం, కల్ల్లోలిత ప్రాంతం అని.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంతో హుస్నాబాద్లో ఎటుచూసినా పచ్చటి పొలాలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ నల్లా పెట్టి అక్కచెల్లెల మంచినీళ్ల గోస తీర్చిండన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు కావాలని గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో ఏండ్లు మొర పెట్టుకున్నా కాలేదన్నారు. సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలు చేసినట్లు తెలిపారు. వారి కలలను నిజం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. తండాలకు నిధులు ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవడం జరిగిందన్నారు.
వొడితెల కుటుంబమంటే.. సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ
ఈ ప్రాంతం అన్నా, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సతీశ్బాబు సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎప్పుడు వరంగల్ వెళ్లినా కెప్టెన్ సాబ్ ఇంటికే సీఎం కేసీఆర్ వెళ్తారని చెప్పారు. ఆ కుటుంబం ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంత సహకరించిందో మనందరికీ తెలిసిన విషయం అన్నారు. సతీశ్బాబు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసన్నారు. సతీశ్బాబు సౌమ్యుడు, ప్రజల మనిషి అని, ఆయన నిత్యం అందుబాటులో ఉండి మచ్చలేని నాయకుడు అని చెప్పారు. మనమంతా ఇక్కడ సతీశ్బాబును, అక్కడ మన సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ అందించే విధంగా మీ అందరి తీర్పు ఉండాలని మంత్రి హరీశ్రావు ప్రజలను కోరారు.