కలెక్టరేట్, డిసెంబర్ 13: జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తూ.. పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమగ్ర తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సవ్యసాచిఘోష్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ మీటిం గ్ హాల్లో ఈఆర్వో, ఏఈఆర్వో, నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో ఆయన సమావేశమై, మాట్లాడారు. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో రూపొందించిన ఓటరు జాబితా నుంచి చనిపోయిన వారి వివరాలను తొలగించాలన్నారు. స్వేచ్ఛగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తుది జాబితాను తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ, జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో 298 లొకేషన్లలో 537పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. డ్రాఫ్ట్ రోల్ ప్రకా రం జిల్లాలో 2,10,353 పురుష ఓటర్లు, 2,21,148 మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు నివేదించారు.
ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్లో వచ్చిన దరఖాస్తులు, పరిష్కార ప్రగతిని వివరించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 9 నవంబర్ 2022 నుంచి పబ్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్, నవంబర్ 9 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలను స్వీకరణ, నవంబర్ 26, 27, డిసెంబర్ 3,4 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబర్ 26న అభ్యంతరాలను తొలగించి, జనవరి 3న తుది ముద్రణకు పంపి, జనవరి 5న తుది జాబితాను అందించేలా ప్రణాళికను రూపొందించామని స్పష్టం చేశారు. జిల్లాలో 80శాతం ఓటరు కార్డులను ఆధార్కార్డుతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతా ల్లో ఓటు నమోదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వీప్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు టీ శ్రీనివాసరావు, పవన్కుమార్, ఏఈఆర్వోలు విజయ్కుమార్, రాజు, ఎన్నికల విభా గం ఉప తహసీల్దార్ రెహమాన్, నర్సింగ్ తదితరులు ఉన్నారు.