korukanti chandar | గోదావరిఖని : సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన రూ.6394 కోట్ల లాభాల నుంచి రూ.4034 కోట్ల లాభాలను పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. కేవలం రూ.2360 కోట్ల లాభాలపై 34శాతం వాటా చెల్లిస్తున్నట్లుగా పేర్కొనడం కార్మికులను దారుణంగా మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. రూ.2174 కోట్ల లాభాల వాటా రావాల్సిన స్థానంలో కేవలం రూ.804.5 కోట్లు మాత్రమే చెల్లించడం కేవలం 12 శాతం గానే ఉందని దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్బెల్టు కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2300 కోట్లను భవిష్య నిధి కింద పక్కన పెట్టారని ఆ డబ్బులు ఏం చేశారు ఇప్పటివరకు వెల్లడించకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు. భవిష్య నిధి డబ్బులు రేవంత్ రెడ్డికి వెళ్తున్నాయా..? ఎంపీ ఎమ్మెల్యేలకు వెళ్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు అని కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కార్మికులకు వాస్తవ లాభాల్లో వాటా చెల్లించారాని ఆయన గుర్తు చేశారు.
కార్మికులకు జరిగిన మోసంపై వాస్తవ లాభాలపై వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేస్తున్న పోరాటానికి బిఆర్ఎస్ జత కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులు తప్పుడు వాగ్దానాలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయారన్నారు. జరిగిన తప్పులు కార్మికులు తెలుసుకొని చైతన్యవంతం అవుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్ నడిపెల్లి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.