కలెక్టరేట్, ఏప్రిల్ 21 : ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వారి నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు కొల్లగొట్టిన నాటి కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా వాటి అమలుపై దృష్టి పెట్టకపోగా, కనీసం తమకు నెలనెలా జీతాలు సైతం బ్యాంకు ఖాతాల్లో జమచేయకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అయినా, అధికారులు స్పందించకపోవడంతో ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు.
జిల్లా వ్యాప్తంగా 215 నుంచి 220 మంది క్షేత్ర సహాయకులు వివిధ గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి రూ.7,500 నుంచి మొదలు రూ.12,400 వరకు ప్రతి నెలా వేతనాలు అందజేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వేతనాలు విడుదల చేయలేదు. వచ్చే నెలలో వస్తాయంటూ ఏనెలకానెల అధికారులు మభ్యపెడుతున్నారని, అప్పోసప్పో చేసి కుటుంబాలను పోషించుకుంటుండగా ఈనెల అయినా వేతనాలు అందజేయాలని అధికారులను కోరితే ఉలుకూ, పలుకూ లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగినట్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంతరం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కలెక్టరేట్ ప్రధానద్వారం ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సంఘం ప్రతినిధులు ఎండీ.ఖలీషా, రవి, అంజిబాబు, హనుమాండ్ల యాదగిరి, సుజాత, వాణి, రమతో పాటు 50 మందికి పైగా క్షేత్రసహాయకులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ను నమ్మితే మా ఆశలు పుచ్చి బుర్రలయ్యాయి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేస్తే, మా ఆశలన్నీ పుచ్చిన బుర్రలైపోయాయి. మాకు పేస్కేల్ వర్తింపజేస్తామని, కన్సాల్డేటెడ్ పే కింద నెలకు రూ.25వేల వేతనమిస్తామిస్తూ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో మేమంతా ఏకపక్షంగా ఆపార్టీకి మద్దతు తెలిపాం. మా కుటుంబాలతో పాటు, బంధువులు, మిత్రుల ఓట్లు కూడా వేయించాం. ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆపార్టీ నాయకులతో పాటు అధికార పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా మమ్ములను పట్టించుకోవడం లేదు. వారి ఇళ్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాం. కనీసం మా వేతనాలు కూడా సక్రమంగా విడుదల చేయకపోవడంతో, మా పిల్లల చదువుల ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం.
-ఎండి.ఖలీషా, ఫీల్డ్ అసిస్టెంటు, కొత్తగట్టు
ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది
మమ్మల్ని గెలిపించున్రి.. మీకు పేస్కేల్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధి పనుల వద్దకొచ్చి వేడుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్ములను మోసం చేసింది. అసలు పేస్కేల్, క్రమబద్ధీకరణ కాదు.. కనీసం మా వేతనాలు కూడా సక్రమంగా అందజేస్తలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన మేమంతా కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసినం. ఇప్పుడు అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నం. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే దవాఖానకు తీసుకెళ్లేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నం. మాకు న్యాయం చేస్తామంటే నమ్మిన పార్టీ మమ్ముల్ని నట్టేట ముంచుతున్నది. వెంటనే జీతాలు విడుదల చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకుంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరును ఎండగడుతాం.
-సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్, చేగుర్తి