Peddapally | పెద్దపల్లి, జూలై 26: యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్ 5642 మీ (18,150 అడుగుల) పర్వతాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు అధిరోహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లో తన చాంబర్లో సే నో టూ డ్రగ్స్ (ప్లెక్సీ)బ్యానర్ను కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామగిరి మండల సెంటనరీ కాలనీ చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి లెంకల వివేకానందరెడ్డి, అతని తండ్రి మహిపాల్ రెడ్డి కలిసి ఈనెల 28న యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్ పర్వతారోహణకు బయల్దేరుతారని తెలిపారు.
దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ ప్రయాణంలో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై సే నో టు డ్రగ్స్, పెద్దపెల్లి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ర్ట లోగో, త్రివర్ణ పతాకం కలిగిన (ప్లెక్సీ)బ్యానర్ను ప్రదర్శిస్తారని తెలిపారు. మహిపాల్ రెడ్డి ఇంటర్నేషనల్ మౌంట్ నియర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, మాజీ సైనికుడు అని తెలిపారు. తండ్రి కొడుకులు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి పెద్దపెల్లి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.