దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల బాధలకు చరమగీతం పాడింది. పూర్తిగా ఆన్లైన్, బయోమెట్రిక్ లావాదేవీల ద్వారా భూముల హక్కులకు రక్షణ ఇవ్వడమే కాదు, కర్షక సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయ ప్రణాళికలు, పంట కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరిస్తూ జీవితానికి వెలుగురేఖగా నిలుస్తున్నది. ‘ఇంతటి గొప్ప విధానాన్ని ప్రతిపక్షాలు అన్నట్టు ఎత్తేస్తే మళ్లీ పాత కథే రిపీట్ అవుతుంది. అవినీతి మళ్లీ ఆజ్యం పోసుకుంటది. దళారుల రాజ్యం నడుస్తది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు వద్దు’ అని రైతాంగం స్పష్టం చేస్తున్నది. ధరణి పోర్టల్తోనే భూములకు భద్రత కలుగుతుందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువవుతుందని చెబుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, జూన్ 1 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, జూన్ 1 (నమస్తే తెలంగాణ): నాడు ఏ పల్లెలో చూసినా భూ సమస్యలే. అన్నీ గెట్టు పంచాయితీలే. దీనికితోడు అక్రమ రిజిస్ట్రేషన్లు. రికార్డుల తారుమారు, భూ యజమానికి తెలియకుండానే ఒకరి భూమి మరొకరి పేరిట ఎక్కేది. సమస్య పరిష్కారానికి మండల ఆఫీసుకు పోతే దళారులదే రాజ్యం. వాళ్లు చెప్పినంత సమర్పించాల్సిందే. అయినా పని అవుతుందా అంటే.. రైతన్న పని విడిచిపెట్టి కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగాల్సిన పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఇక భూమి కొన్నా, అమ్మినా అది ఓ పెద్ద తతంగంలా ఉండేది. రెండు మూడు రోజులు తిరగనిదే పనికాకపోయేది. ఇలా దశాబ్దాలపాటు నరకం చూసిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి నేస్తంగా మారిపోయింది. దశాబ్దాల సమస్యలకు చెక్ పెట్టి ధైర్యాన్నిచ్చింది. పూర్తిగా ఆన్లైన్, బయోమెట్రిక్ పద్ధతి ద్వారా భూముల హక్కులకు రక్షణ ఇస్తూ మీ భూమి భద్రం అనే భరోసా ఇచ్చింది. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతున్నది. అంతేకాదు, ప్రభుత్వం అందిస్తున్న ప్రపంచం మెచ్చిన పథకాలైన రైతుబంధు, రైతు బీమా వంటివి నేరుగా రైతుకు అందడంలో కీలకమైంది. అధికారుల చేతివాటానికి చెక్ పెట్టింది. భూ వ్యవహారాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసింది. అయితే విజయవంతంగా సాగుతున్న ధరణి పోర్టల్ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రతిపక్షాలు చెబుతుండగా, రైతులు మండిపడుతున్నారు. అదే జరిగితే పాత రోజులు పునరావృతమవుతాయని, దళారుల రాజ్యం నడుస్తదని చెబుతున్నారు. తమకు తెలియకుండానే భూముల హక్కులు ఇతరులకు అయ్యే ముప్పు ఉంటుందని, ఇవి వివాదాలు, ఘర్షణలు, హత్యల వంటి తీవ్రనేరాలకు దారి తీస్తాయంటున్నారు. పైరవీకారులకు లంచాలు దొరకడం లేదన్న సాకుతోనే విమర్శలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారు. అందుకే ప్రతి పక్షాల మాటలు వినేదిలేదని స్పష్టం చేస్తున్నారు.
ధరణితోనే ధైర్యం వచ్చింది..
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఏ రోజు కూడా రైతుల గురించి పట్టించుకోలే. భూమి కొన్నా, అమ్మినా ప్రహసనంగా ఉండేది. రోజుల తరబడి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మధ్య దళారుల దోపిడీకి అంతే లేకుండా పోయేది. మేము పడుతున్న ఇబ్బందులను అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒక్కనాడు కూడా పట్టించుకోలే. రైతుల బాధలు ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ అమల్లోకి తెచ్చి, క్రయ, విక్రయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిండు. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసిండు. సాదా బైనామా కింద ఇరవై అయిదేండ్ల కింద కొన్న భూమికి మొన్నటి దాక కూడా పాసుబుక్కు రాలేదు. ధరణి వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. అధికారులు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన్రు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన్రు. ఇన్నాళ్లుగా పాసుబుక్కు వస్తదో రాదోననే భయంతో ఉన్న. కానీ పాసుబుక్కు వస్తదని చెప్పటంతో ధైర్యం వచ్చింది. రైతుబంధు కూడా వస్తదట. చానా సంతోషంగ ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నా. ఊర్లలో ఉండే మాలాంటి వారి ఇబ్బందులు తొలగించేందుకే ధరణి పోర్టల్ వచ్చిందని భావిస్తున్నా.
– బండ శ్రీకాంత్, కరీంనగర్
దళారుల దందా దూరమైంది..
ధరణి రాకముందు భూములు అమ్మాలన్నా, కొనాలన్నా దళారుల దగ్గరికి పోవాల్సిందే. బాండ్ పేపర్లు కొన్నప్పటి నుంచి మొదలు భూమి రిజిస్ట్రేషన్ అయి, కాగితాలు చేతికచ్చే దాకా వాళ్లదే రాజ్యం. రిజిస్ట్రేషన్కు ఎంత ఖర్చవుతదో కూడా తెల్వక పొయేది. దళారులు అడిగినన్ని పైసలు ఇచ్చు కోవాల్సిందే. లేకుంటే, రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెట్టి, రోజుల కు రోజులు తిప్పుకుంటుండె. ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇచ్చుడు లేదు. రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి ఎదురుచూసుడు లేదు. మీసేవలకు పోయి దరఖాస్తు చేసుకుంటే మనకు వచ్చిన డేటా ప్రకారం తహసీల్ ఆఫీస్కు వచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నం. పది నిమిషాల్లోనే పనై పోయింది. టైం వేస్టు కాలే. సీఎం కేసీఆర్ సారు పుణ్యంతోని నయాపైసా ఖర్చు లేకుండా, పావుగంటలనే రిజిస్ట్రేషన్ పనులు పూర్తైనయి. దళారుల దందా లేకపోవడంతో పని పూర్తి కాగానే ఇంటికి తిరిగి వెళ్తున్నం.
– బట్టు వెంకటేశ్వర్లు, ఆరెపల్లి
..పక్క ఫొటోలోని వ్యక్తి పేరు ముక్కెర రాజం. ఊరు మెట్పల్లి మండలం రాంలచ్చక్కపేట. ఆయనకు వ్యవసాయమే జీవనాధారం. ఆరు నెలల కిందట రాజం 51 గుంటలన్నర వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిండు. రెండు రోజుల కిందట ఈ భూమిని ధరణలో సేల్ డీడ్ కోసం మీసేవలో రిజిస్ట్రేషన్కుగాను స్లాట్ బుక్ చేసుకున్నడు. అందుకు చలానాగా 29,500 చెల్లించాడు. బుధవారం ఇద్దరు సాక్షులతో అవసరమైన పత్రాలను వెంట తీసుకుని కార్యాలయానికి వచ్చాడు. భూమి విక్రయించిన, కొనుగోలు చేసిన వారివి, ఇద్దరి సాక్షుల ఫొటోలు, నేత్ర, వేలి ముద్రలు తీసుకున్నారు. కొంత సమయం వ్యవధిలోనే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి కావడంతో రాజం సంతోషపడ్డాడు.
ధరణి దారి చూపింది.
దశాబ్దాల కాలంగా వివిధ రకాలుగా రెవెన్యూలో పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ దారి చూపింది. 2017లో తెలంగాణ సర్కారు రెవెన్యూ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని గుర్తించింది. అందుకు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఆ తర్వాత 2020లో ధరణి పోర్టల్ను తెచ్చి భూ రికార్డుల ప్రక్షాళనలో క్లియర్గా ఉన్న భూములన్నింటికీ హక్కులు ఇచ్చింది. వివాదాస్పదంగా, లోపాలతో ఉన్న వాటిని పార్ట్బీగా గుర్తించింది. పార్ట్బీలో ఉన్న సమస్యలను గుర్తించిన ప్రభుత్వం క్రమ క్రమంగా కొత్త కొత్త ఆప్షన్లను ఇస్తూ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. అత్యంత వివాదాస్పదమైన భూములకు మాత్రమే ధరణి పోర్టల్లో చోటు దక్కలేదు. అలాంటి వాటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రెవెన్యూ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ సమస్యలను సర్కారు పరిష్కరిస్తున్నది. సాదాబైనామాల ద్వారా జరిగిన క్రయ, విక్రయాలను సైతం పరిష్కరించింది. ఇక నిషేధిత జాబితాలు ఉన్న భూములను సైతం అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమయ్యే వివరాలను సేకరించి వాటికి పరిష్కారమార్గం చూపింది. నా మొత్తం రెవెన్యూ సర్వీస్లోనే ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చేసిన పని శాశ్వతంగా గుర్తించుకుంటా. అనేక మంది రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించాననే పూర్తిస్థాయి సంతృప్తి నాకు కలిగింది.
– బండి ప్రకాశ్, తహసీల్దార్ (మంథని)
అమ్ముడు కొనుడు అల్కగైంది..
గతంల ఓ సారి భూమి పట్టా చేయించుకునేందుకు పెద్ద తతంగమే అయింది. ఓ అసామిని పట్టుకొని నలుగురైదుగురు పెద్ద మనుషులను పట్టుకొని జగిత్యాలల ఉన్న ఆఫీసుకు పొద్దుగాలనే పోయినం. పొద్దుగూకె దాక ఉన్నా పని కాలే. పైసలైతే ఖర్చయితున్నై గని పని మాత్రం కాలె. ఇట్ల నాలుగైదు రోజులు తిరిగినంక పట్టా అయింది. మళ్లా మొన్న మా ఊళ్లే 10గుంటల భూమి కొన్న. నాలుగు రోజుల కింద స్లాట్ బుక్ చేసుకున్న. రిజిస్ట్రేషన్ కోసం ధర్మపురి తైసీల్ ఆఫీసుకు వచ్చిన. ఎన్నిరోజులైతదో అనుకున్న. కానీ కేసీఆర్ సార్ ధరణి తెచ్చిండు. గంటల్నే పనైతదని అంటే నమ్మలే. కానీ అయింది. నమ్మలేకపోయిన. చాలా సంబురమైంది. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో అమ్ముడు కొనుడు అల్కగైంది. గీ కాంగ్రెసోళ్లు ధరణిని వద్దంటున్నరని విన్న. వాళ్ల పాలనల మేం పడ్డ కష్టాలు ఇంకా మరిచిపోలే. రైతులు సంతోషంగా ఉంటే వాళ్లకు నచ్చదు. ధరణిని ఆపేయాలంటున్న కాంగ్రెస్ను మనం గక్కన్నే ఆపాలె.
– గొల్ల మల్లేశం, రాయపట్నం(ధర్మపురి)
ధరణి లేకుంటే మళ్లీ పాత కథే..
ధరణి రాకముందు రెవెన్యూ వ్యవస్థ ఆగమాగముండే. నేను పట్వారిగా పని చేసిన రోజుల్లో ఒకరి భూమి, ఇంకొకరి పేరు మీదకు రావాలంటే ఆ భూమి యజమాని కనీసం రెండు, మూడు నెలలు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుండె. ఇవన్నీ నేను కండ్లారా చూసిన. ఇయాల ధరణి పోర్టల్తో నేను కొన్న భూమి కేవలం 20 నిమిషాల్లో పట్టా చేసుకున్న. భూముల రిజిస్ట్రేషన్లు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తానాబాద్లో అయితుండె. రిజిస్ట్రేషన్, ఇతర ప్రక్రియలకు 10 రోజులు పడుతుండె. తహసీల్దార్ ఆఫీస్ల్లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండె. వీఆర్వో, ఆర్ఐ డీటీ, తహసీల్దార్ల సహకారం ఉంటే మూడు నెలల్లో పట్టా కాగితాలు చేతికి వచ్చేవి. కానీ ఇవ్వాళ నేను ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే నేను కోరుకున్న రోజు, కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ అయింది. ఇది ధరణి అద్భుతం. ధరణి లేకుండా రెవెన్యూ వ్యవస్థే పూర్తిగా ఆగమయ్యేది. ఎప్పటి కప్పుడు వ్యవసాయ భూములు ఆప్ టూ డేట్గా ఉండాలంటే ధరణి ఉండాల్సిందే.
– మొగుసాల లక్ష్మారెడ్డి, రిటైర్డు వీఆర్వో, మల్లాపూర్ (ధర్మారం మండలం)