Dharani | భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులకు కొండంత ధైర్యానిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందనే విశ్వాసాన్ని కల్పించింది. ఇంతకు ముందు భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చేతుల్లో ఉండగా, ఇప్పుడంతా ఆన్లైన్లోనే జరుగుతుండడంతో తమకు తెలియకుండా ఏదీ జరుగదనే ధీమానిస్తున్నది. గతంలోలాగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా సులువుగా రిజిస్ట్రేషన్ అవుతుండడంతో కర్షకలోకం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నది.
పెద్దపల్లి, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతుల్లో ధైర్యం వచ్చింది. ఇన్నాళ్లూ పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఆన్లైన్లో తమ భూమి భద్రంగా ఉంటుందన్న భరోసా వచ్చింది. అంతే కాకుండా, ఏ క్షణంలోనైనా పహాణి, వన్బీ నిమిషాల్లో హక్కు దారులు పొందేందుకు సులువైన మార్గంగా ధరణి మారింది. భూ హక్కు పత్రాలను పొందడం, సత్వర సేవలు, సేవల్లో పారదర్శకత లభిస్తున్నది. దీనికి తోడు క్షణాల్లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లతో ప్రజలకు తిప్పలు తప్పాయి. ధరణి పుణ్యమాని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ అయి డిజిటల్ పాసుపుస్తకాలు ఇంటికి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో జిల్లా వ్యాప్తంగా 4,15,089 సర్వే నెంబర్లను గుర్తించగా ,అందులో అనేక సమస్యలకు ధరణి పరిష్కారం చూపింది.
పాత పద్ధతి అసలే వద్దు
నాకు 80 ఏండ్ల మీదుంటయ్. నా పేరు మీదున్న ఎకరం 20 గుంటల భూమిని నా కొడుకు బాలునాయక్ కొడుకు(మనుమడు) పేరు మీద తాసిల్దార్ ఆఫీస్ల పట్టా చేసిన. తొందరగనే తాసిల్దార్ సార్ పట్టా చేసిండు. పట్టా కాయితాలు, జమాబంధీ కాయితాలు ఒక్కటేసారి మా మనుమడికి ఇచ్చిండు. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణితోనే పట్టా తొందరగ అయింది. ఈ పద్ధతి రాకముందు సుల్తానాబాద్కు వెళ్లి రిజిస్టర్ ఆఫీసుల భూమి పట్టా చేయించుకునేటోళ్లం. పట్టా చేసుకోడానికే ఒక్కరోజయ్యేది. పట్టా కాయితాలు కొన్ని రోజులకు వచ్చేవి. జమాబందీ మళ్లో ఆర్నెళ్లు పట్టేది. దానికి పెద్ద తిప్పలయ్యేది. అప్పుడు శానా ఇబ్బంది పడ్డం. కానీ, కేసీఆర్ పట్టా చేసే పద్ధతిని మార్చి ధరణి తెచ్చిండు. పట్టాలు అందుబాటులో మండలాఫిసులనే అయితున్నయి. ఖర్చులు తప్పినయి. గంటల్నే తాసిల్దార్ ఆఫీసుల భూముల పట్టాలు తొందరగ అవుతున్నయి. ఈ పద్ధతే బాగుంది. పట్టాదారు సంతకం లేనిదే భూమి వేరేటోళ్ల పేరు మీదకు అయితలేదు. భూములు ధరణిల భద్రంగా ఉంటున్నయి. గతంలో మాదిరిగా మళ్లీ రికార్డుల్లో భూములను రాసుడు పద్ధతి వస్తే రైతులకు పెద్ద నష్టం జరుగుతది. ఒకరి భూమి ఒకరికి రాస్తరు. పాత పద్ధతి అస్సలే వద్దు.
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నానా తిప్పలు పడేది. రిజిస్ట్రేషన్కు వెళ్తే పొద్దంతా పట్టేది. భూమి మీద బ్యాంక్ లోన్ తీసుకుందామన్నా వీఆర్వో, గిర్దావర్, తహసీల్దార్ చుట్టూ రోజుల తరబడి తిరిగితే గానీ సంబంధిత సర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. కానీ, ధరణి ఫోర్టల్ రావడంతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఏ రోజంటే ఆరోజు, ఏ టైమ్కంటే ఆ టైమ్కు స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే వెలుసుబాటు కలిగింది. అంతేకాకుండా అమ్మినోళ్ల పేరు మారి, మన పేరు మీద పట్టా పాస్బుక్ ఏ అధికారి చుట్టూ తిరగకుండానే మన అడ్రస్ను వెతుక్కొని వస్తున్నది. లోన్ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ సేవలో దరఖాస్తు చేస్తే వెంటనే వ్యాల్యూ సర్టిఫికెట్, వన్ బీ వస్తున్నయ్. బ్రోకర్, అధికారులకు లంచాలు ఇచ్చే పనిలేకుండా పోయింది. పక్కాగా పాసు పుస్తకం వస్తున్నది. సెల్ఫోన్ చేతిలో ఉంటే ఎప్పుడైనా.. ఎక్కడైనా మన భూమి వివరాలు తెలుసుకోవచ్చు. భూమి విస్తీర్ణం, లొకేషన్ మ్యాప్ పొందవచ్చు. ధరణి వల్లే భూమి వివరాలు పొందటం సులువైంది. పట్టాపాస్ బుక్ పాస్పోర్ట్ సైజ్లో ఉండటంతో బేబులో పెట్టుకొని వెళ్లొచ్చు.
-పోలుదాసరి వెంకటేశం, రైతు (పెద్దపల్లి)
సీఎం సార్ది గొప్ప మనుసు
రైతుల సమస్యలు గుర్తించి, వెంటనే పరిష్కరించిన సీఎం కేసీఆర్ సార్ ది గొప్ప మనుసు. గత ప్రభుత్వాల హయాంలో భూమి సమస్యలు ఎన్నో పెండింగ్ల ఉండేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. భూమి రైతుకు ఆత్మగౌరవం లాంటిదని చెప్పి రైతుకు ఉన్న భూమిని ధరణి పేరుతో పట్టా చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ సార్. గ్రామాల్లో ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూ సమస్యలన్నీ పోయినయ్.
-ఆదె చంద్రయ్య, రైతు, జాఫర్ఖాన్పేట, (కాల్వశ్రీరాంపూర్ మండలం)
పదిహేనేండ్ల తగాదా తీరింది..
పదిహేనేండ్ల కిందట నేను మా ఊరికే చెందిన వ్యక్తి వద్ద సర్వే నెంబర్ 389/3లోని వ్యవసాయ భూమి ఎకరం 10 గుంటలు కొన్న. అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోలె. తర్వాత నాకు భూమి అమ్మిన వ్యక్తి చనిపోయిండు. దీంతో భూమి రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన కూతురిని ఎన్నిసార్లు అడిగినా చేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో బ్యాంకులో లోను, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించకపోయేవి. ప్రతి రోజూ బాధపడుతుండేవాడిని. కానీ, ప్రభుత్వం ధరణి తెస్తున్నదని తెలుసుకున్న తర్వాత మనసు కొంచెం కుదుటపడింది. ధరణి ప్రారంభించినంక మళ్లీ వెళ్లి ఆమెను అడుగగా వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేసింది. గింతజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎప్పటికీ మరిచిపోను.
-తాడవేన రాజేశం, రైతు, తొగర్రాయి, (సుల్తానాబాద్ మండలం)
పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అన్నీ క్లియర్గా ఉంటే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. అమ్మకందారులు, కొనుగోలుదారులతో పాటు వారసత్వం రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకునే వారి పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. డాక్యుమెంట్లు అన్ని క్లియర్గా ఉంటే ఎలాంటి ఆలస్యం ఉండదు. అదే విధంగా జమాబంధీని అమలు చేసి బ్యాంకింగ్ తరహా పాస్ బుక్లో భూమిని పొందుపరుస్తున్నాం. దీని వల్ల భవిష్యత్తులో రైతులు ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ధరణి పోర్టల్ ద్వారా సత్వర సేవలు, రికార్డుల భద్రత ఉంటుంది.
-అనుపమరావు, తహసీల్దార్,(కాల్వశ్రీరాంపూర్ మండలం)
కిరికిరి పోయింది..
మేము ముగ్గురం అన్నదమ్ములం. మాకు తండ్రి ఇచ్చిన వ్యవసాయ భూమి పంచుకోవడానికి పలుమార్లు మాట్లాడుకున్నం. కానీ, ఒక దారికి రాలేదు. పసలుకు ఒకరు అని పంటలు సాగు చేసుకునే వాళ్లం. దాంతో అందరికీ బాధ అనిపించేంది. సీఎం కేసీఆర్ సార్ రైతుల ఇబ్బందులను గుర్తించి ధరణి తీసుకచ్చిండు. దీంతో మా తండ్రి నుంచి వచ్చిన భూమిని తప్పసరిగా పంపకాలు చేసుకోవాల్సి రావడంతో ఎవరిది వాళ్లం చేసుకున్నం. దీంతో 12 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. నాకు 11 గుంటల భూమి వచ్చింది. ధరణితో మా భూమి కిరికిరి పోయింది.
-వంగ రామస్వామి, రైతు, తొగర్రాయి(సుల్తానాబాద్ మండలం)
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ధరణితోనే భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తున్నది. ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు రైతుల కండ్ల ముందే పరిష్కారమైనయ్. రైతుల గురించి ఇంత మంచిగ పట్టించుకుని సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రులు ఎవ్వరూలేరు. గతంలో భూ పట్టాల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినం. అయినా పరిష్కారం కాకపోయేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు రావడం లేదు. నేరుగా గ్రామాల్లోనే సమస్య పరిస్కారం చేసి, కొత్త పట్టా బుక్కులు ఇచ్చిన్రు.
-కొప్పుల సత్యనారాయణ, రైతు, కిష్టంపేట (కాల్వశ్రీరాంపూర్ మండలం)
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసిండ్లు
నాడు భూముల రిజిస్ట్రేషన్ అంటే చాలా ఇబ్బంది ఉండేది. రోజుల కొద్దీ ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కావు. కానీ, ఇప్పుడు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. నా భర్త పేరు మీద 33 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చని పోయిండు. ఆ భూమిని నా పేరు మీదకు మార్చుకోవడానికి ధరణిల దరఖాస్తు పెట్టుకున్నా. తహసీల్దార్ ప్రకాశ్ సారు అన్ని పత్రాలు చూసి, సాక్షులను విచారించి, నా భర్త పేరు మీద భూమిని నిమిషాల్లోనే నా పేరు మీదకు మార్చిన్రు. ఎక్కడ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తొందర తొందరగ నా పని పూర్తి చేసిన్రు.
-పిక్కల మల్లమ్మ, సిరిపురం (మంథనిమండలం )