గొల్లపల్లి, జూలై 25: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ అన్నారు. గొల్లపల్లిలో ఆయిల్ పాం సాగులో అంతర పంటల సాగును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అధిక వర్షాలు కురుస్తున్నందున పంట పొలాల్లో నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక వర్షాలు, మబ్బు పట్టిన వాతావరణంలో తెగుళ్లు వ్యాపించే అవకాశాలున్నందున కాపర్ 3 గ్రాముల ఆక్సీ క్లోరైడ్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 30కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలని, పత్తిలో నీరు ఎక్కువగా ఉండి ఎరువులు వేయలేని పరిస్థితుల్లో ఎన్పీకే 19:19:19 లేదా 13:0:45 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. సోయా పంటలో నీరు ఎక్కువైనప్పుడు పై ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం ఉందని, చెలెటెన్ ఐరన్ ఈడీటీఏ 12 శాతం ఎరువును లీటర్ నీటికి గ్రాము చొప్పున లేదా అగ్రామిన్ మాక్స్ ఎరువును లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కందిలో ఎండు తెగులును గమనించినా లేదా తెగులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని చెప్పారు.
పూర్తిగా పంటలు దెబ్బతిన్న పొలాల్లో సోయా, పత్తి కాకుండా స్వల్పకాలిక రకాలు (పీఆర్జీ-100, పీఆర్జీ -176) కంది రకాలు లేదా పెసర్లు, మినుములు వంటి పంటలను వేసుకుంటే నీళ్లున్న రైతులు యాసంగిలో మరో పంట వేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుంచి మురుగు నీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలని తెలిపారు. అలాగే పొలాల్లో మందులను పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏడీఏ కల్పన, ధర్మపురి ఏడీఏ రాంచందర్, గొల్లపల్లి ఏవో కరుణ, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.