Farmers | కాల్వ శ్రీరాంపూర్ మే 24. రైతులు పంట మార్పిడీ విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు భూసారాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. పంటలపై యూరియాను అధికంగా వినియోగించితే పెను ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. ప్రతీ రైతు సాధ్యమైనంతవరకు యూరియాను పంటలపై తక్కువగా వినియోగించాలని తెలిపారు. పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజలు వేసినట్లయితే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు.
తొలకరి వర్షాలకు జీలుగ, జనుము, పెసరు తదితర వాటిని నాటి 45 రోజుల తర్వాత భూమిని దున్నాలన్నారు. అనంతరం వరి వంటి పంటలు వేసినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త మధుకర్ రావు, ఏడీఏ శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున. ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు గాజనవేన సదయ్య, పొన్నమనేని దేవేందర్ రావు, మాదాసి సతీష్, వోద్ది గోపాల కిషన్ రావు, మూడెత్తుల లింగయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.