తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన్న దుష్ప్రచారానికి దిగిన కేంద్ర వైఖరిని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో మహా ధర్నాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట రైతాంగం ఆందోళనకు సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ధర్నాకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాదిగా రైతాంగం తరలిరానున్నది.
కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మొదటి నుంచి రైతుల పక్షపాతిగా ఉంటున్న బీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తూ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా సాగుకు అవసరమైన నీటి వనరుల పెంపుతో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలు పండిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఏదో విధంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. వరి వేయవద్దు అంటూ మెలికలు పెట్టి సాగు తగ్గించే కుట్రలు పన్నిన కేంద్రం తాజాగా, ఉపాధిహామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న కల్లాలపై కత్తి కట్టింది. ఈ కల్లాల బిల్లులు వాపసు ఇవ్వాలని దుష్ప్రచారానికి దిగింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది.
నేడు మహా ధర్నా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని నిరిసిస్తూ శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కరీంనగర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పెద్దపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జగిత్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు రైతులు తరలిరానున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్కుమార్, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, జడ్పీ చైర్ పర్సన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తోపాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షులు తెలిపారు.