జగిత్యాల టౌన్, అక్టోబర్ 4: రైతాంగ హామీ అమలుకోసం జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి 15వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ నిరసన తెలిపారు. సుమారు 2వేల మందికిపైగా తరలిరాగా, పాత మార్కెట్ బీటు నుంచి పాదయాత్రగా కలెక్టరేట్ సముదాయానికి వచ్చారు. పోలీసులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేసి అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందన్న నమ్మకంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి గద్దెనెక్కించారని, కానీ గెలిచిన తర్వాత మోసం చేశారన్నారు. వాగ్దానాలు అమలు చేయడంలో రైతుల్లో గందరగోళం సృష్టించారని, 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా 60 శాతం మందిని గాలికొదిలేశారని మండిపడ్డారు. రుణమాఫీ అమలులో లేనిపోని ఆంక్షలు విధిస్తూ రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రుణమాఫీలో రేషన్కార్డు అంటూ ఆంక్షలు విధించడం దారుణమని, బ్యాంకులు ఇచ్చిన రుణాల ఆధారంగా చేసుకొని రుణమాఫీ హామీని వంద శాతం పూర్తి చేయాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని, వానకాలం సీజన్ పూర్తి కావస్తున్నా రైతు భరోసా నిధులు జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయకులు వేముల కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక చేతులెత్తేసి రైతులను నిండా ముంచిందన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రంలోని రైతులందరం కలిసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోనళలో రైతు ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్ధం మహేందర్రెడ్డి, గడ్డం రాజరెడ్డి, ఐలేని సాగర్రావు, ఏలేటి నర్సింహారెడ్డి, ఉదగిరి ఆదిరెడ్డి, చిలివేరి తిరుపతి, డబ్బా రమేశ్, సురకంటి అంజిరెడ్డి పాల్గొన్నారు.
రైతులు దాదాపు 5 గంటల పాటు తమ నిరసన వ్యక్తం చేసినా, కలెక్టర్ సత్యప్రసాద్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకొని బారికేడ్లను తోస్తూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన రైతు బద్దం మహేందర్రెడ్డి సొమ్మసిల్లిపోగా, పోలీసులు దవాఖానకు తరలించారు. నిరసన విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి రాగా, రైతులు తమ డిమాండ్లను విన్నవించుకున్నారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు.
కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ల ముందు రైతు కండువా వేసుకొని ఓట్లు అడిగిన్రు. ఎన్నో మాటలు చెప్పిన్రు. రైతులకు మేలు చేస్తారని అనుకున్నం. కానీ గెలిచిన తర్వాత టెక్నికల్గా తప్పించుకుంటున్రు. రైతు రుణమాఫీని కొర్రీలు పెట్టి 40 శాతం మందికి మాత్రమే చేసిన్రు. మిగిలిన 60 శాతం మందికి బ్యాంక్, ఇతరత్రా ప్రాబ్లంలు చెప్పి ఆపేసిన్రు. ప్రభుత్వం రైతులను టెక్నికల్గా మోసం చేస్తుంది.
– అయిల్నేని సాగర్రావు, సింగిల్విండో చైర్మన్ (మల్యాల)
సీఎం రేవంత్రెడ్డి చెప్పినవన్నీ ఉత్తమాటలే. ఎలక్షన్ల ముందు రైతులు బ్యాంకుకు వెళ్లి 2 లక్షలు రుణం తెచ్చుకోండి అని చెప్పిండు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని అన్నడు. రుణం తెచ్చుకున్నం. ఇప్పటి వరకూ రూపాయి కూడా మాఫీ కాలే. మీది వడ్డీ కట్టమంటే అప్పు తెచ్చి కట్టిన. వానకాలం పంట సాయం కూడా రాలేదు. అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అంటుండు. సన్నవడ్లు బయట అమ్ముకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తయి. ప్రభుత్వానికి ఎందుకు అమ్ముడు?
– అత్తినేని రాజన్న, అల్లీపూర్ (రాయికల్ మండలం)
కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు మోసం చేసింది. ఎన్నికల ముందు మా రైతులకు ఎన్నో మాటలు చెప్పి ముంచింది. రుణమాఫీ చేయక, రైతు భరోసా ఇవ్వక చేన్లు, చెలకల్లో పనిచేసుకుంటూ బతికే మమ్ముల రోడ్లపైకి తెచ్చింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసేలా చేస్తంది. అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అంటంది. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇయ్యాలె. లేదంటే ఊరుకోం.
– పిడుగు రాజిరెడ్డి, రైతు (వెంకట్రావుపేట)