పెగడపల్లి, జనవరి 30: తెలంగాణ రైతులు అదృష్టవంతులని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కర్షకుడి ఇంట సంతోషం వెల్లివిరుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదని, అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు మాటలు తప్ప చేతలు రావని, ఒక్క పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
బంతికపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం, నంచర్లలో న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి సహకార సంఘం గోదాంను మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 92 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. దళితబంధు దేశంలో గొప్పదని, విడతల వారీగా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పారు.