Manohar Reddy | పెద్దపల్లి కమాన్, మే 28 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ను బీఆర్ ఎస్ నాయకులతో కలిసి దాసరి గురువారం సందర్శించారు. మార్కెట్లో తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యం కుప్పలను ఆయన పరిశీంచారు. ఈ సందర్భంగా వరి, మొక్కజొన్న అమ్ముకునేందుకు మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ లో రైతుల దుస్థితి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలన్నరగా మార్కెట్లోనే ధాన్యం కుప్పలు ఉన్నాయని, రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకొచ్చి నెలన్నర కావస్తున్నా, కేవలం 50 శాతం మాత్రమే తూకం వేయడం అధికారుల నిర్లక్ష్యంనికి నిదర్శనమని ఎద్దె వా చేశారు. అకాల వర్షానికి మొక్కజొన్నలు తడిసిపోయి వాసన వస్తున్నాయని, వరి ధాన్యం కుప్ప కింద తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఇంతలా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యంతో బార్దాన్, సుతిలి కూడా రైతే కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో రైతుకు సాగు సమయంలో యూరియా, మందు బస్తాలు ఇవ్వలేదు, పెట్టుబడి సహాయం (రైతుబంధు) అందించడంలోనూ పూర్తిగా విఫలమైంది. తీరా పంట చేతికొచ్చాక బార్దాన్ (సంచులు) రైతే కొనుక్కోవాలని, సుతిలి రైతే తెచ్చుకోవాలని, బస్తాలు కూడా రైతే నింపుకునే దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. ప్రభుత్వ చేతగాని తనంతో కాంటాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబాట్టారు. మిల్లర్ల తరుగు పేరిట దోపిడీ చేస్తున్నా వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మార్కెట్లో చిరిగిన బస్తాలు ఇచ్చి, ఒక్కో బస్తాలో 35 నుండి 39 కిలోలు మాత్రమే తూకం వేస్తూ మిల్లర్లు దయాదాక్షిణ్యాలపై రైతులను వదిలేశారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు తూకం వేయాల్సి ఉండగా, కొన్నిచోట్ల 41 కిలోల 600 గ్రాములు తూకం వేస్తూ, తరుగు పేరిట మళ్లీ కిలో కు పైగా అదనంగా గుంజుకుంటూ క్వింటాలుకు 5 నుండి 6 కిలోల వరకు రైతుకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు తమ ట్రక్ షీట్లలో కూడా మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మార్కెట్ యార్డ్కు వచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కాలయాపన చేయకుండా వెంటనే వేగవంతంగా కొనుగోలు చేయాలనీ, అకాల వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలనీ, నిబంధనల ప్రకారం 40 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం వేసేలా చూడాలనీ, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్న మిల్లర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. రైతును రాజు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు రైతులను రోడ్డున పడేసి మొద్దు నిద్రపోతుందని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతుందని దాసరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకులు వెన్నం రవీందర్, సలేంద్ర రాములు యాదవ్, పెంచాల శ్రీధర్, రేవెల్లి స్వామి, నాంసాని సరేష్ బాబు, మేకల కుమార్ యాదవ్, ముత్యాల రాజయ్య, జుబేర్, పల్లె మధు, వైద శ్రీనివాస్, గండు రంగయ్య, లవన్ కుమార్, నుగిళ్ళ వీరేశం, బొడ్డుపల్లి రమేష్, కుక్క మనోజ్ కుమార్, రమేష్, వేణుగోపాలరావు, తీగల సదయ్య, కారుపాకల సంపత్, ధర్మపురి, నర్ల అంజయ్య, చిట్టవేన వినీత్, బి. లింగయ్య, తోటపల్లి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.