పెద్దపల్లి, ఫిబ్రవరి29: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేడిగడ్డ బరాజ్కు తక్షణమే మరమ్మతులు చేయాలని, మేడిగడ్డతోపాటు అన్నారం బరాజ్లో నీటిని నిల్వ ఉంచి రైతులను ఆదుకోవాలని మంథని నియోజకవర్గ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను కాపాడాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు.
తలాపునే గోదావరి పారుతున్నా వాడుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. వృథాగా సముద్రంలో కలిసే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించారన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించి వాటి ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోసి సాగునీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. గత ఐదేండ్లుగా సాగునీటికి ఏ బాధా రాలేదని, సంతోషంగా పంటలు సాగు చేసుకున్నామని వివరించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు కుంగిపోయాయనే సాకుగా చూపించి మరమ్మతులు చేయకపోవడం సరికాదని సూచించారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టును ఎండబెట్టడం వల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి బరాజ్కు వెంటనే మరమ్మతులు చేయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక్కడ రైతులు పెగడ శ్రీనివాస్, రవి, రోడ్డు శ్రీనివాస్, మార్పాక కొమురయ్య, నూకల సురేందర్, కాసిపేట రాములు, చింతలపూడి దేవెందర్ రెడ్డి, దాసరి రవీందర్, ఎరుకల రవి, ఆతూరి నర్సయ్య, ఎస్కే బాబు, ఎస్కే షకీల్, గువ్వల చందు, ఆత్మకూరి కుమార్, పసునూటి రాజు, రోడ్డ మల్లయ్య, శీలం విష్ణువర్ధన్ రెడ్డి, మంథని కిష్టయ్య, కన్నూరి బావు పాల్గొన్నారు.