పచ్చిరొట్ట ఎరువుగా ఎంతో ఉపయోగపడుతుంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే వరి సాగుకు ముందు ఈ విత్తనాలను దుక్కుల్లో చల్లుకుంటారు. అయితే ఈ సారి ఈ విత్తనాలు ఆలస్యంగా రావడం, అనుకున్న మేర రాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. గతంలో మే మొదటి వారంలోనే వ్యవసాయశాఖ పంపిణీ చేసినా.. ఈ సారి నెలాఖరు వరకు కూడా సరిగా ఇవ్వకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. ఎక్కడ పంపిణీ చేస్తున్నారని తెలిసినా కేంద్రాల వద్ద ఎగబడుతున్నారు. అయినా అందకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ) : వరి సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువు కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతాంగం భావిస్తున్నది. అందుకే ప్రతి సీజన్లోనూ పచ్చిరొట్ట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. డిమాండ్కు అనుగుణంగా విత్తనాలు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సీజన్లోనే చుక్కలు చూపుతున్నది. గతేడాది అమ్మకాలను చూసి ఈ యేడాది అవసరాన్ని అధికారులు అంచనా వేస్తారు. అయితే ఈ సారి కరీంనగర్ జిల్లాలో 7 వేల క్వింటాళ్లకు ఇండెంట్ ఇచ్చారు. పరిస్థితిని బట్టి చూస్తే అంతకు మించిన డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తుండగా, అయితే కనీసం ఇండెంట్ ఇచ్చిన వరకైనా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పిస్తారా..? అనే సందేహాన్ని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఎక్కువగా పచ్చిరొట్ట సీడ్స్ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ సారి ఇక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో సీడ్ దిగుమతి కానట్టు తెలుస్తున్నది.
పోయిన వానకాలం సీజన్లో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 33,245 ఎకరాల్లో 3,989 క్వింటాళ్ల జీలుగ, 523 ఎకరాల్లో 78 క్వింటాళ్ల జనుము కలిపి మొత్తం 33,768 ఎకరాల్లో పచ్చిరొట్ట సాగు చేశారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ సారి విత్తన ప్రణాళికలో 6,800 క్వింటాళ్ల జీలుగ, 200 క్వింటాళ్ల జనుము విత్తనాలను ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 2,500 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల జనుము మాత్రమే వచ్చింది. ఈ వచ్చిన కొద్ది విత్తనాలను ఎంపిక చేసిన 62 డీసీఎంఎస్ కేంద్రాలు, సింగిల్ విండో కార్యాలయాలు, ఆగ్రో సెంటర్లలో బుధవారం పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 60 శాతం రాయితీపై ఇస్తున్న ఈ విత్తనాల కోసం సంబంధిత ఏఈవోలు పర్మిట్ రాయాల్సి ఉంటుంది.
అందుకోసం రైతులు పాసు పుస్తకాలతో ఇటు వ్యవసాయ అధికారుల కార్యాలయాలకు అక్కడి నుంచి ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది. బుధవారం దాదాపు అన్ని మండల్లాలోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరి కనిపించారు. అయితే కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి డీసీఎంఎస్ కేంద్రానికి వచ్చిన సుమారు 40 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు రెండు మూడు గంటల్లోనే పూర్తి కావడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. సరిపడా విత్తనాలు అందుబాటులో లేక పోవడంతో ఇటు అధికారులు, అటు పంపిణీ కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 2,500 క్వింటాళ్ల వరకు జీలుగ విత్తనాలు తెప్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా సరిపోవని, ఇండెంట్ ఇచ్చిన వరకైనా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లాకు అవసరమైన మరిన్ని పచ్చిరొట్ట విత్తనాలు తెప్పిస్తున్నాం. ఇప్పటి వరకు 2,500 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు తెప్పించాం. 62 కేంద్రాల్లో పొజిషన్ చేశాం. మరో 2,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రెండు మూడు రోజుల్లో తెప్పిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంపిణీ చేస్తాం. పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్, డీఏవో (కరీంనగర్)