కోల్సిటీ/ ఓదెల/కాల్వశ్రీరాంపూర్, జనవరి 11 : ఉమ్మడి జిల్లా చలికి గజగజ వణుకుతున్నది. నాలుగు రోజులుగా చలి పంజా విసురుతుండడంతో పొద్దంతా ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం స్వెట్టర్లు, వెచ్చని దుస్తులను ధరించి చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో జనం పట్టపగలు కూడా ముసుగేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రామంగుండం ఏరియాలో సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి షిఫ్టుల్లో విధులకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఉదయం, రాత్రి ప్రధాన రోడ్లను దట్టమైన పొగ మంచు కమ్మడంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. కనిష్ఠంగా 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి ప్రభావంతో పెద్దలు, పిల్లలు జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు గురవుతున్నారని చెబుతున్నారు. రోజులో కనీసం 20 నిమిషాలు ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరంపై సూర్యకాంతి పడాలంటున్నారు. పీచు ఎక్కువగా ఉండే ఆహారం, తృణ ధాన్యాలు తీసుకోవాలని, పిల్లలకు ప్రొటీన్లు ఎక్కువగా లభించే గుడ్లు తదితర పదార్థాల్ని ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.
చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చలికాలంలో త్వరగా వ్యాధులకు గురయ్యే ప్రమాదముంటుంది. పిల్లలకు తల్లిపాలే శ్రేష్ఠమైనవి. వాటితోపాటు పౌష్ఠికాహారం అందించాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు దవాఖానకు తీసుకెళ్లడం ద్వారా చలికాలంలో వచ్చే న్యూమోనియా వ్యాధిని నివారించవచ్చు. మంచుతో కూడిన దుమ్ము, ముక్కు ద్వారాల్లోకి ప్రవేశిస్తుంది. చిన్నారులు ఈ గాలిని పీల్చడం వల్ల గొంతు మంట, ముక్కు దిబ్బడ, గొంతులో కాయలు తదితర సమస్యలతో బాధపడతారు. ఒక్కో సమయంలో గొంతులో ఎర్ర పూత కూడా వస్తుంది. శ్వాస ఆడకపోవడం, ఆయాసంతో బాధపడుతారు. చలి తీవ్రతకు గురికాకుండా చిన్నారులను కాపాడుకోవాలి.
– క్యాస శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణుడు (గోదావరిఖని)