Fake currency | వేములవాడ, డిసెంబర్ 13 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో వస్తున్న సభ్యుల నుండి వస్తున్న రూ.500 నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది.
వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్ కు నగదు అప్పగించారు. సంఘం సభ్యుల నుండి అందిన మొత్తం నగదును శుక్రవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అయితే రూ.500 నకిలీ నోట్ రావడంతో ఒక్కసారిగా సభ్యురాలు ఆందోళన గురైంది.
గతంలోనూ ఇప్పటికే రెండుసార్లు నకిలీ నోటు రాగా తనకు మూడోసారి కూడా అదే నకిలీ నోట్ రావడంతో సభ్యురాలు సభ్యుల నుండి నగదు సేకరించేందుకు భయాందోళన గురవుతున్నారు. ఇకపై ప్రతినెలా చెల్లించాల్సిన నగదును నేరుగా ఒకరోజు మాత్రమే ఇవ్వాలని అది కూడా, బ్యాంకు సమయం ఉన్నప్పుడే ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్టు తెలిసింది. వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాలలో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.