Dharmaram | ధర్మారం, ఆగస్టు 3 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరానికి స్థానిక ఎంపీడీవో వేముల సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి కంటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వయసు పైబడిన వారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ వారు ఇట్టి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. నిరుపేదల కోసం ఏడాదికి రెండుసార్లు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఉన్నవారికి శస్త్ర చికిత్స చేయించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం రేకుర్తి కంటి దవాఖాన ఆప్తమాలజిస్ట్ ప్రభాకర్ రోగులకు కంటి పరీక్షలు చేశారు.
శిబిరానికి సుమారు వందమంది రోగులు వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 32 మందికి కంటిలో లోపాలు ఉన్నట్లు నిర్ధారణ చేయడంతో వారిని శస్త్ర చికిత్స కోసం కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖానకు ప్రత్యేక బస్సులు తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దాగేటి రాజేశ్వరి, ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, వార్డు సభ్యులు, ప్రోగ్రాం చైర్మన్ తన్నీరు రాజేందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం, ప్రోగ్రాం కో చైర్మన్లు డాక్టర్ కామని శ్రీనివాస్, పీ మునీందర్ రెడ్డి, ఆర్సీ కావేటి రాజగోపాల్, జెడ్సీ తలమకి రవీందర్ శెట్టి, జిల్లా మైక్రో క్యాబినెట్ సామ ఎల్లారెడ్డి, క్లబ్ కార్యదర్శి కట్ట రమేష్, జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ సాదుల వెంకటేశం, క్లబ్ సభ్యులు నాడెం శ్రీనివాస్, ఎండి ముజాహిద్, స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ నరేందర్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గుమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.