రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అధైర్యపడొద్దు.. అన్నివిధాలా అండగా ఉంటానని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. మంగళవారం ఆయన గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలతోపాటు సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. మరమగ్గాల కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీవైనగర్లో దార్ల వీరేశం ఇటీవల మృతి చెందగా, కుటుంబ సభ్యులైన కౌన్సిలర్ దార్ల కీర్తన, బీఆర్ఎస్ నేత సందీప్ను పరామర్శించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నేత తవుటు కనకయ్య మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు టీవీ నారాయణ, మధు, చందును పరామర్శించారు. తవుటు కనకయ్య విగ్రహాన్ని సుందరయ్యనగర్లో ఏర్పాటు చేయాలని సీఐటీయూ నేత మూషం రమేశ్ వినతిపత్రం అందించగా, రామన్న సానుకూలంగా స్పందించారు. ముస్తాబాద్ మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య కుమారుడు రాజు-సాయిపూజ వివాహం ఇటీవల కాగా, నూతన వధూవరులను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత రాచమడుగు సంతోష్రావు తండ్రి కిషన్రావు, నామాపూర్లో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తాడెపు రవి తండ్రి బాలమల్లు మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
గూడెంలో మాజీ సర్పంచ్ ఆవునూరి ఎల్లం కూతురు దీపిక వివాహం ఈ నెల 22న జరుగనుండగా, నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. దమ్మన్నపేటలో కొత్తింటి బాలమణి-వెంకట్రెడ్డి కొడుకు వివాహ విందుకు హాజరై, నూతన వధూవరులు సందీప్-భావనను ఆశీర్వదించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్రెడ్డి తండ్రి పాపిరెడ్డి, ముచ్చ సత్తిరెడ్డి తల్లి రాజమ్మ, బొప్పాపూర్లో మాజీ సర్పంచ్ రామ భీమేశ్ తల్లి యశోద ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే నూతన జంటలను నిండు నూరేండ్లు చల్లంగా ఉండాలని దీవించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలను యధాతథంగా ఉంచాలని గ్రామస్తులంతా క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేయగా, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. విలీన గ్రామాలన్నీ తిరిగి పంచాయతీలుగా మార్చేందుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపించాలని చైర్పర్సన్ జిందం కళకు సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని చెప్పారు. ఆయాచోట్ల కేటీఆర్ వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.