మిల్లర్ల అక్రమాలు మితిమీరుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సీఎమ్మార్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని, సొమ్ము చేసుకుంటున్న బాగోతం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారుల దాడుల్లో వెలుగు చూసింది. రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో హుజూరాబాద్ ప్రాంతంలోని పలు మిల్లులపై మంగళవారం నిర్వహించిన దాడుల్లో అక్రమాలు వెలుగుచూడడం కలకలం రేపుతున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేసిన అధికారులు, ఒక మిల్లును సీజ్ చేయడంతోపాటు ఆయా మిల్లుల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చర్యలు తప్పవని రవీందర్సింగ్ స్పష్టం చేశారు.
– కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/హుజూరాబాద్ )
కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్ : 2021-22 వానాకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్ కింద బియ్యం ఇవ్వకుండా పలువురు ధాన్యం విక్రయించుకున్నట్లుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం హుజూరాబాద్లోని నాలుగు మిల్లులపై ఏకకాలంలో దాడులు చేశారు. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్తోపాటు పలువురు అధికారులు అందులో పాల్గొన్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు, ఏకకాలంలో హుజూరాబాద్లోని మహాలక్ష్మీ రైస్మిల్, వరుణ్ ఇండస్ట్రీస్, గోమాత ఇండస్ట్రీస్, లక్ష్మీగణపతి రైస్ మిల్లులో దాడులు చేయగా, భారీగా అక్రమాలు బహిర్గతమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్వహించిన తనిఖీల్లో సీఎంఆర్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, నిల్వ ఉన్న బియ్యంతో పాటు రికార్డులను పరిశీలించగా, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మహాలక్ష్మీ ఇండస్ట్రీస్లో సీఎంఆర్కు సంబంధించిన 10,437 బ్యాగులు అంటే 4,173 క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీనిపై సదరు యజమాని శ్రీనివాసును ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. అలాగే లక్ష్మీ గణపతి రైస్మిల్లులో 3,817 బస్తాలు ధాన్యం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. మహాలక్ష్మీ ఇండస్ట్రీ యజమాని శ్రీనివాసు.. వరుణ్ రైస్మిల్లు కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ మిల్లు వివరాలు ఆరా తీయగా, తన అక్రమాలు ఎక్కడ బహిర్గతమవుతాయోనని భావించి సదరు యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు సదరు మిల్లును సీజ్ చేసి, యజమాని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మీ గణపతి మిల్లులో పీడీఎస్ బియ్యం ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు, షాంపిల్స్ సేకరించి స్థానిక అధికారులకు అప్పగించారు. ఇవేకాదు పలు మిల్లుల్లో గన్నీ బ్యాగులకు బదులుగా తెల్ల సంచుల్లో నింపిన ధాన్యాన్ని గుర్తించారు. వాటికి సదరు యజమానుల నుంచి సరైన సమాధానం రాలేదు.
ఫిర్యాదుల వెల్లువ
ఇటీవలే హుజూరాబాద్లోని హనుమాన్ రైస్ మిల్లులో జరిగిన అక్రమాలను రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ అధికారులు బహిర్గతం చేశారు. ఇక్కడ చర్యలు తీసుకుంటుండగానే, పలువురు మిల్లర్లు ధాన్యం విక్రయించుకున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు చాలా సార్లు చెప్పినా, సీఎంఆర్ కింద బియ్యం పెట్టకుండా పలువురు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన దాడుల్లోనూ అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయి. చాలా మంది సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని విక్రయించుకొని సొమ్ము చేసుకున్నారు. వారి అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం జరిగిన దాడుల్లో పీడీఎస్ బియ్యాన్ని పలు మిల్లుల్లో గుర్తించడం దీనికి నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ధాన్యం విక్రయించుకొని సొమ్ముచేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుండగా, కొంత మంది అక్రమార్కులు వ్యవహరిస్తున్న తీరు మొత్తం రైస్ ఇండస్ట్రీకే చెడ్డపేరు తెస్తుందని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు.
తప్పుచేస్తే ఉపేక్షించం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మిల్లర్లకు అండ గా నిలుస్తున్నది. అందులో భాగంగానే సీఎంఆర్ కింద ధాన్యం కేటాయింపులు చేస్తున్నది. అందు కు అనుగుణంగా బియ్యం ఇవ్వకుండా పలువురు మిల్లర్లు ధాన్యాన్ని విక్రయించుకొని సొమ్ముచేసుకుంటున్నట్లుగా తమ శాఖ అధికారులు చేసిన దాడుల్లో బయబపడుతున్నది. అయితే అక్రమాలకు పాల్పడింది ఎంతటివారైనా విడిచిపెట్టం. సీఎం ఈవిషయంలో అత్యంత కఠినంగా ఉన్నా రు. సీఎంఆర్ విషయంలో తప్పుచేస్తే ఎవరినీ ఉ పేక్షించం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకునే ప్రతి మిల్లు యజమానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
– సర్దార్ రవీందర్సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్