మళ్లీ ఎన్నికల బదిలీల పర్వం మొదలు కాబోతున్నది. ఇటీవల శానసభ ఎన్నికల సమయంలో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు లోకసభ ఎన్నికల నేపథ్యంలో కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వగా.. ఆ మేరకు జిల్లాల వారీగా యంత్రాంగం జాబితాను సిద్ధం చేసి పంపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది అధికారులకు కొద్ది రోజుల్లోనే స్థానచలనం ఉండే అవకాశమున్నది.
కరీంనగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించింది. ఆ మేరకు ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికలు ఏడు దశల్లో కొనసాగి, 2019 మే 19 వరకు జరిగాయి. 2019 మే 23న దేశవ్యాప్తంగా ఒకేసారి ఫలితాల లెక్కింపు జరిగింది. అప్పుడు మన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఒకేసారి మొదటి దశలోనే జరిగాయి. ఈసారి కూ డా అలానే జరుగుతాయనే ప్రచారం జోరందుకున్నది. గతంలో కంటే మరింత ముందుగా అంటే.. వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో లోకసభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. అందుకనుగుణంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తున్నది.
ఇప్పటికే ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు జిల్లాల వారీగా అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. తుది ఓటరు జాబితా ప్రకటన అనంతరం ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముండగా, ఎన్నికలకు పూర్తిస్థాయి లో కసరత్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టి ఉంచుకొని ఎలాంటి పొరపా ట్లూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల శాసనసభ ఎన్నికల సమయం లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగానే ఉద్యోగుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ బదిలీలు జరగనున్నాయి. వచ్చే జూన్ 30 నాటికి సొంత జిల్లాలో మూడేళ్లకుపైగా విధులు నిర్వర్తించిన అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా జాబితాను సిద్ధం చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలెక్టర్లను ఆదేశించింది. ఈనెల 16లోగా వివరాలు పంపించాలని జీఏడీ స్పష్టం చేసింది.
అయి తే, వివిధ కారణాలతో జీఏడీకి ఈ నెల 20 వరకు వివిధ జిల్లాల నుంచి వివరాలు వెళ్లాయి. సదరు కేంద్ర నిబంధనల ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది ఉద్యోగులు బదిలీ కావొచ్చని అధికారవర్గాల ద్వారా సమాచారం అందుతున్నది. అయితే, ఈసారి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎక్కువగా బదిలీలు ఉండే అవకాశముందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గత శాసనభ ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి తక్కువగా బదిలీలు జరిగాయని, ఇప్పుడు సేకరించిన వివరాల ప్రకా రం చూస్తే సొంత జిల్లాల్లో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిలో ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖలోనే ఉన్నారని చెబుతున్నారు.
మొత్తంగా బదిలీలకు జాబితా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడమే తరువాయి.. వెనువెంటనే బదిలీల పర్వం మొదలు కానున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే ట్రాన్స్ఫర్లు ఉండొచ్చని తెలుస్తున్నది. దీంతో అధికారుల్లో హైరానా మొదలైంది. ఈ బదిలీల్లో ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది.