Spirit of Service | జగిత్యాల, ఆగస్టు 31 : సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీఎస్ లత చేతుల మీదుగా వాల్మీకి ఆవాసానికి 60 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చక్కటి వసతి, భోజనం ఇతర సదుపాయాలు కల్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు.
వాల్మీకి ఆవాసానికి తమ వంతు సాయంగా ప్రతీ సంవత్సరం పిల్లలకు అవసరం అయిన బియ్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన శాశ్వత బియ్యం దాతల సభ్యులను అదనపు కలెక్టర్ అభినందించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తారని అలాంటి వారందరికీ సహాయం అందించడం ఏ ప్రభుత్వాల వల్ల కూడా సాధ్యం కాదన్నారు. సమాజంలోని అందరి అవసరాలను ప్రభుత్వాలు కొంతమేరకే తీర్చే అవకాశం ఉంటుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన ఇలాంటి దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
విద్య ద్వారానే పేదరికంతోపాటు సమాజంలోని అనేక రుగ్మతలను రూపు మాపవచ్చన్నారు. గత 32 సంవత్సరాలుగా సామాజిక స్పృహ కలిగిన దాతల సహకారంతో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు భారతీయ సంస్కృతి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, ఆవాస కోశాధికారి సిరిపురం శ్రీనివాస్, ఎలగందుల కైలాసం, సభ్యులు అశోక్ రావు, సంపూర్ణాచారి, గౌరీశెట్టి హరీష్, గుండా సురేష్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ తో పాటు శాశ్వత బియ్యం దాతలు నూనె శ్రీనివాస్, వావిలాల శేఖర్, దువ్వ రాజు, ఉత్తూరి ఈశ్వర్, యాంసాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.