Collector Satya Prasad | కోరుట్ల, జూలై 28 : సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతీ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫార్మ్పాండ్కు కలెక్టర్ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం రీచార్జ్ బోర్వెల్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపడుతున్న కమ్యూనిటీ సోక్పిట్ పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రతీ వర్షపు నీటి బొట్టును భూగర్భంలోకి ఇంకించి నీటి నిల్వలను పెంచడం అత్యంత అవసరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వీబీజీఆర్ఏఎం నిధులతో గ్రామాల్లో ఫార్మ్పాండ్లు, సోక్పిట్లు, ఊట కుంటలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల్లో ఫార్మ్పాండ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫార్మ్పాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వల్ల పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరిగి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం కోరుట్ల మండలం జోగిన్పెల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న వీవో భవనం, అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భవనాల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణాలన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.