క్రిభ్కోతో కలిసి రూ.700 కోట్లతో ఏర్పాటు
వెల్గటూర్తోపాటు పలు చోట్ల స్థలాన్ని పరిశీలించిన అధికారులు
మారునున్న జిల్లా రూపురేఖలు
పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు
యువత, రైతాంగానికి కల్పతరువుగా పరిశ్రమ
జగిత్యాల, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): సేద్యపు ఖిల్లా జగిత్యాల జిల్లా దశ తిరుగనున్నది. రైతాంగానికి అండగా, వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ధర్మపురి నియోజకవర్గంలో ప్రఖ్యాత ఎరువుల సంస్థ క్రిభ్కోతో కలిసి ఇథనాల్, రైస్బ్రాన్ పరిశ్రమ నెలకొల్పేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపడంతో ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తున్నది. రూ.700 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు అనువైన స్థలాన్ని అన్వేషించే పనిలో పడింది. బహుళ ప్రయోజనాలున్న ఈ ఫ్యాక్టరీ జిల్లా ప్రజలకు కల్పతరువుగా మారనున్నది.
తెలంగాణలో సారవంతమైన భూములు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప సేద్యపు జిల్లాగా మారింది. జగిత్యాల రాష్ట్రంలోనే అత్యధికంగా వరిని పండించే జిల్లాగా పేరుగాంచింది. 2.94 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సేద్యరంగంలో గొప్ప ఫలితాలను సాధించిన జగిత్యాల ఫ్యాక్టరీల పరంగా, సాంకేతికంగా కొంత వెనుకబడి ఉంది. ఇక్కడి దిగుబడికి సరిపోయే స్థాయిలో రైస్మిల్లులు సైతం లేవు. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలో పెద్ద సంఖ్యలో రైస్మిల్లుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించింది. దీంతో ఇటీవలి కాలంలో జిల్లా పరిధిలో కొన్ని రైస్మిల్లులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో జగిత్యాల ప్రాంతంలో వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. పుష్కలమైన నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయి ఎరువుల ఉత్పత్తిలో కీలకమైన క్రిభ్కో సంస్థ ద్వారా ఇథనాల్, రైస్బ్రాన్ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఉత్పత్తి ఇలా..
ధర్మపురి ప్రాంతంలో క్రిభ్కో, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఇథనాల్, రైస్బ్రాన్ అయిల్ ఉత్పత్తి పరిశ్రమలో ఇథనాల్తో పాటు, రైస్బ్రౌన్ ఆయిల్, కార్న్ ఆయిల్ను ఉత్పత్తి చేయనున్నారు. వరిలోని పై పొట్టు (తౌడు) నుంచి రైస్బ్రాన్ ఆయిల్ను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మక్కల నుంచి సైతం కార్న్ ఆయిల్ను ఉత్పత్తి చేయనున్నారు. రైస్బ్రాన్ అయిల్ను నేరుగా విక్రయించేందుకు అవకాశాలుంటాయి. కార్న్ అయిల్ సైతం వంట నూనెల వినియోగానికి అనువైనదే అయినా ఇక్కడి వాతావరణం, శీతోష్ణస్థితుల నేపథ్యంలో నేరుగా కార్న్ అయిల్ను వినియోగించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో రైస్బ్రాన్ అయిల్తో పాటు, సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ అయిల్ వంటి వాటితో కార్న్ అయిల్ను బ్లండ్ చేసి విక్రయించేందుకు అవకాశాలున్నాయి. చెరుకు, మక్క, వరి ధాన్యం నుంచి ఇథనాల్ను సాంప్రదాయబద్ధంగా తీస్తారు. ఇథనాల్ను బయో డీజిల్ పరిశ్రమలో, ఫార్మాస్యూటికల్ విభాగంలో విరివిగా వినియోగిస్తున్నారు. మందులు కూడా తయారు చేస్తున్నారు. ఆల్కహాల్కు సంబంధించి డిస్టరీల్లోనూ వినియోగిస్తారు. మెలాసిస్ను వినియోగించి తయారు చేసే పదార్థాలలోనూ ఇథనాల్ను వినియోగిస్తున్నారు.
బడుగు, బలహీనవర్గాలు, యువతకు ఉపాధి
ధర్మపురి నియోజకవర్గం పరిధిలో రూ.700 కోట్లతో నిర్మించనున్న రైస్బ్రాన్, ఇథనాల్ ఫ్యాక్టరీ బడుగు, బలహీన వర్గాలకు కల్పతరువులా మారనుంది. వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని గతం నుంచి ఇక్కడి ప్రజలు కోరుతున్నా గత ప్రభుత్వాలు స్పందించలేదు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపి క్రిభ్కో సంస్థతో కలిసి మహత్తర ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఇక్కడి ప్రజలకు, యువకులకు మేలు జరుగనుంది. ధర్మపురి నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే దాదాపు 75 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
రూ. 700 కోట్లతో ఇథనాల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీ
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిభ్కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇథనాల్, రైస్బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వల్ల జగిత్యాల జిల్లా సాంకేతిక రంగ స్వరూపమే మారిపోనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగాను జిల్లా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడన్నాయి. రూ. 700 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రతి రోజు రైస్బ్రాన్ అయిల్, ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. రెండు దశల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏడాదికి లక్షల మెట్రిక్ టన్నుల వరి, మక్కజొన్నను రైస్బ్రాన్, కార్న్ బ్రౌన్, ఇథనాల్ కోసం వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమ స్థాపన తొలి దశలో రోజుకు 2.50 లక్షల కిలోలీటర్ల సామర్థ్యంతో బ్రాన్ ఆయిల్ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో దశలో రోజుకు మరో 2.50 లక్షల కిలోలీటర్ల సామర్థ్యం మేరకు రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తవుతుంది. మొత్తంగా రోజుకు ఐదు 5 లక్షల కిలోలీటర్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. నెలకు లక్షల టన్నుల వరి ధాన్యం, మక్క జొన్నతో రైస్బ్రాన్ తయారవుతున్న నేపథ్యంలో రైతులకు సైతం తమ ఉత్పత్తులను ఫ్యాక్టరీకి చేరవేసేందుకు సులువుగా ఉంటుంది.
స్థల పరిశీలనలో అధికార యంత్రాంగం
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు నిర్ణయించిన ప్రభుత్వం, స్థలాన్ని అన్వేషించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ క్రమంలో కలెక్టర్ రవి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి శివారులో స్థలాన్ని పరిశీలించగా, 1090 సర్వేనంబర్లో 413 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. గతంలో ఈ స్థలంలో కొన్ని నిర్మాణాల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, గతంలో ఎంత భూమిని ఏఏ సంస్థలకు కేటాయించారు?, ఎంత స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధ్యయనం చేశారు. గతంలో కేటాయించిన భూమి కాకుండా మిగిలి ఉన్న భూమిలో నిర్మాణాలు జరుగకుండా, పొలాలు ఇతర పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్తంభంపల్లితోపాటు, మరికొన్ని చోట్ల సైతం స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనువైన స్థల అన్వేషణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు.