ఆ కుటుంబం కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. కూలి చేసుకుని జీవించే కుటుంబ పెద్ద మృతితో ఆగమైంది. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది. కొడుకుకు బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స చేయించేందుకు, కూతురును చదివించేందుకు ఇబ్బంది పడింది. కూలీ పనిచేసినా ఇల్లు గడవడమే కష్టమైంది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెకు దళితబంధు ధీమానిచ్చింది. బుక్స్టాల్ ఏర్పాటు చేసుకోవడంతో కుటుంబం తలరాతమారింది.
– జమ్మికుంట, ఆగస్టు 16
జమ్మికుంట, ఆగస్టు 16: ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన గుండ్ల రాజమ్మ-శివయ్య భార్యాభర్తలు. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారు. కొడుకుకు బ్రెయిన్ ట్యూమర్ కాగా, కూతురు బీటెక్ చదివేది. ఇంటి పెద్ద శివయ్య ఐదారేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబం భారం రాజమ్మపై పడింది. కూలీ పని చేసినా కుటుంబం గడవడమే గగనమైంది. కొడుకు బ్రెయిన్ ట్యూమర్ చికిత్సతోపాటు కూతురు చదువు ఖర్చులకు ఇబ్బంది పడేది. కూతురు రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠశాలలో కొద్దిపాటి జీతంతో టీచర్గా పనిచేసింది. అయినా ఆర్థికంగా కష్టాలు వెంటాడడంతో సతమతమైంది. ఏడాది క్రితం దళితబంధు రావడంతో రాజమ్మ కుటుంబానికి అండ దొరికింది. వచ్చిన డబ్బులతో రాజమ్మ జమ్మికుంట-వీణవంక ప్రధాన రోడ్డులో బుక్ సెల్లర్స్ అండ్ జనరల్ స్టోర్స్ను ఏర్పాటు చేసుకున్నది. బీటెక్ చదివిన కూతురు స్రవంతికి బుక్స్టాల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. షాప్ బాగానే నడుస్తుంది. రాజమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో కూలీ బంద్ చేసి ఇంటి వద్దనే ఉంటున్నది. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న అన్నకు మంచి వైద్యం చేయిస్తున్నది.
దళితబంధే మాకు పెద్ద దిక్కు
2022లో దళితబంధు వచ్చింది. నేను టీచర్గా బంద్ జేసిన. అమ్మకు చాతకావడం లేదు. కూలీకి వద్దన్న. ఇంటికాన్నే ఉంటుంది. షాపు పెట్టుకున్నం. నేనే నడిపిస్తున్న. పొద్దున వస్త. సాయంత్రం ఇంటికి పోత. బాగానే నడుస్తుంది. వేరే షాపు వాళ్లకంటే తక్కువకు అమ్ముతున్న. ఎక్కువ లాభం రాకున్నా ఫర్వాలేదనుకున్న. నాకు పెట్టుబడి దళితబంధే కదా. ఇబ్బంది లేదు. అన్న మందులకు రూ.3వేలు అయితున్నయ్. కిరాయికి రూ.8,500 పోగా నెలకో రూ.15వేలు మిగుల్తున్నయ్. ఇప్పుడు మా కుటుంబానికి దళితబంధు పెద్ద దిక్కైంది.
– గుండ్ల స్రవంతి, రాజమ్మ కూతురు