కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చేతి నిండా పనిలేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. ఆకలి, అప్పుల బాధలతో అనేక మంది అర్ధంతరంగా తనువులు చాలించారు. అప్పటి ప్రభుత్వాల నిరాదరణకు గురైన నేతన్నలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహిస్తున్నది. రాయితీ కరెంట్ సరఫరా చేయడం అందులో భాగమే. పవర్ లూమ్స్ నిర్వహించే నేతన్నలు ఒకప్పుడు కరెంట్ లేక అల్లాడే వారు. 12 గంటలు సాంచాలు నడిస్తేనే పొట్టగడిచే నేతన్నల పరిస్థితి కరెంటు కోతలతో అత్యంత దారుణంగా మారింది. రోజుకు ఆరుగంటల కరెంటు కూడా దిక్కులేని పరిస్థితి ఉండేది. పని దొరకని పరిస్థితిలో పవర్ లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేవారు. కరెంట్ కోతల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయి నిత్యం నష్టాలను ఎదుర్కొనేవారు. సాంచాలు నడవక, ఉపాధి లేక అన్నమో రామాచంద్రా.. అంటూ పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, సూరత్కు వలస బాట పట్టారు. అనుబంధ పరిశ్రమలైన డైయింగ్, సైజింగ్, వార్పిన్లు మూతపడక, పరిశ్రమ నడవక యజమానులు లక్షల విలువైన సాంచాలను తుప్పుకింద కిలోల లెక్కన అమ్ముకున్నారు. ఒక్క సిరిసిల్లలోనే నాడు 15 వేలకు పైగా ఉన్న సాంచాలు 8 వేలకు తగ్గాయి.
స్వరాష్ట్రంలో పుల్
స్వరాష్ట్రంలో సాంచాలకు ఫుల్ కరెంటు అందుతోంది. దీంతో చేతి నిండా పనిదొరికి రాత్పైలీ, దిన్పైలీతో కామ్గార్లు బిజీ అయ్యారు. రోజుకు లక్షలాది మీటర్ల వస్త్ర ఉత్పత్తులతో వేలాదిమందికి ఉపాధి నిస్తూ సిరిసిల్ల ‘సిరి’శాలగా మారింది. కరెంటుతో పాటు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లును రాష్ట్ర చేనేత జౌళి, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సిరిసిల్లకు ఇప్పించారు. దీంతో నాడు వలస బాటిన కార్మికులంతా సొంత ప్రాంతానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత, కరెంటుపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నందున సిరిసిల్లలో 8 వేలున్న మరమగ్గాలు 30 వేలకు పెరిగాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సైజింగ్, డయ్యింగ్, వార్పిన్లు ఇలా అనుబంధ పరిశ్రమలన్నీ తిరిగి పూర్వవైభవం సంతరించుకున్నాయి. అలాగే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్కులోనూ కరెంటు ఫుల్గా ఉంటుంది. ఇప్పటికే, గోకుల్దాస్ నిట్వేర్ కంపెనీలో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. 24 గంటల కరెంటు అందిస్తున్నందున చాలా పరిశ్రమలు సిరిసిల్లకు తరలి వస్తున్నాయి.
స్వరాష్ట్రంలో చేతి నిండా పని
దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు కరెంటు వస్తుండడంతో మాకు చేతినిండా పనిదొరుకుతున్నది. 50 శాతం సబ్సిడీ అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకపోయేది. పనిదొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. కరెంటు ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలు, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధి మెరుగైంది. నేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం ద్వారా లబ్ధి జరుగుతున్నది. నేతన్న బీమా తీసుకువచ్చి చేనేత కుటుంబాల్లో భరోసా నింపింది.
– ఎన్నం మునీందర్, పవర్లూం యజమాని (చొప్పదండి)
ఆధునీకరణతో ఎగుమతులు
24గంటల నాణ్యమైన కరెంటుతో మరమగ్గాల పరిశ్రమ జోరుగా నడుస్తున్నది. పాతకాలపు సాంచాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో ఆధునీకరించిన ఎయిర్జెట్, వాటర్ జెట్లూంల ఏర్పాటుకు యజమానులు అడుగులు వేస్తున్నారు. చేనేత మంత్రి కేటీఆర్ చొరవతో టెక్స్టైల్స్ పార్కు యజమానులంతా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు స్టడీ టూర్ కోసం వెళ్లి వచ్చారు. అక్కడి పరిశ్రమలు ఎలా అభివృద్ధి సాధించాయన్న అంశంపై అవగాహన పెంపొందించుకుని ఇక్కడ అధునాతన మరమగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లలో జెట్లూంల ఏర్పాటు చేసుకున్నారు. మరిన్ని యూనిట్లలో ఏర్పాటు చేసేందుకు యజమానులు ప్రయత్నాలు చేస్తున్నారు.కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, చామన్పల్లి, గర్శకుర్తి, ఆసిఫ్నగర్, రామడుగు, తదితర గ్రామాల్లో 978 యూనిట్ల పరిధిలో 3,083 పవర్ లూమ్స్ నడుస్తున్నాయి. వీరికి వచ్చే విద్యుత్తు బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా 50 శాతం రాయితీని ఇస్తున్నది.
మళ్లీ ఆరోజులు గుర్తురావద్దు
నాడు కరెంటు కోసం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కరెంటు సక్కగ లేక సాంచాలు అమ్ముకున్న పరిస్థితి. మళ్లీ ఆరోజులు రావద్దు. కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందో తెలియదు కనీ, రెప్పపాటు పోకుండా కరెంటు ఇవ్వడం వల్ల సిరిసిల్ల సాంచాలే కాదు.. కరెంటుపై ఆధార పడ్డ ప్రతి పరిశ్రమ బాగా నడుస్తున్నది. ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. నిరంతరం నాణ్యమైన కరెంటు అందిస్తున్నందున ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.
కరెంటు కష్టాలు తీరినయ్
నాడు కరెంటు ఎప్పుడస్తదో తెలియక సాంచాల్లో టాకాలు వేసుకుని పడుకునేది. రాత్రనక, పొద్దనక సాంచాలు చాలు పెట్టి కామ్గార్లందరం నిద్రపోయినం. కరెంటు వచ్చినంక సాంచాలు చాలైతే సప్పుడుకు లేచినం. కరెంటు గోసతో కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక పరేషాన్ అయినం. అమ్మో ఎంత నరకం చూసినమో.? కేటీఆర్ సార్ దయవల్ల కరెంటు అసలే పోతలేదు. రెండు పైలీలు మంచిగ నడుస్తున్నయ్. పని కూడా మంచిగైతంది. ఇయ్యాళ ఎక్కడ చూసినా సాంచాల సప్పుడే వినిపిస్తంది. మా కష్టాలు తీరినయ్.
– అడిగొప్పుల శ్రీనివాస్ , నేత కార్మికుడు( సిరిసిల్ల)
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
చేనేత, పవర్లూమ్ యాజమనులు, కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. నిరంతరం సరఫరా చేస్తున్న కరెంటుతో మాకు చేతినిండా పనిదొరుకుతున్నది. దీనికి తోడు 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతో కొండంత భరోసా వచ్చింది. అంతే కాకుండా, 50 ఏండ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి రూ.2016 పింఛన్ ఇవ్వడంతోపాటు, నేత కార్మికులకు త్రిప్ట్ పథకంతో అండగా నిలుస్తున్నది. మా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి పది కాలాల పాటు చల్లగా ఉండాలి.
– ఇప్పనపల్లి రాజేశం, పవర్లూం యజమని (చొప్పదండి)
గీలెక్కన ఎప్పుడూ చూడలే..
ఒకప్పుడు సాంచాలు నడపడమంటనే పెద్దలు యాదికొచ్చేది. పొద్దంతా 6 గంటల కరెంటు కూడా ఉండకపోయేది. కరెంటు వత్తదని సాంచాలకాడనే సచ్చినం. ఉక్కపోత, దోమలు కుట్టినా కార్ఖాన్లనే ఉండేటోళ్లం. వచ్చిన కరెంటు రెండు గంటలు కూడా ఉండకపోయేది. పనిగాక పగార రాక పొట్టకు బాగా తిప్పలయ్యేది. ఒపూట ఉపాసముండినం. ఇయ్యాళ కేటీఆర్ సార్ వచ్చినంక కరెంటు పోవుడనే ముచ్చటే లేదు. రెండు పూటలా తింటున్నం. చేసిచేసి యాష్టకొచ్చి అరగంటైనా కరెంటు పోవట్లేదనిపిస్తంది. దేవుడిలాగ వచ్చిన సారు మాకు బతుకు దెరువునిచ్చిండు.
– సిరిపురం రాజేశం నేత కార్మికుడు (సిరిసిల్ల)