UltraTech Cement plant | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం పర్మినెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఆవరణలో కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం నిరసన చేపట్టారు. ఉదయం జనరల్ షిఫ్ట్ కార్మికులతో కలిసి కర్మాగారం ఎదుట ధర్నా చేపట్టారు. గత నెల రోజులుగా కార్మిక సంఘం ఎన్నికల కోసం ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినప్పటికిని యాజమాన్యము ప్రస్తుతం ఉన్న యూనియన్ నాయకులు కుమ్ముకై తమ ఎన్నికలను తరచు వాయిదా వేస్తున్నారని ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
కర్మాగారంలో పాతుకుపోయిన కార్మిక సంఘం నాయకులు ఎన్నికలు సజావుగా సరియైన సమయంలో పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటికే కార్మికులు పలు డిమాండ్లు నష్టపోయారని ఇంకా ఎన్నికలు కాలయాపన చేయడం మూలంగా కార్మికులకు అనేక హక్కులు హరించుకుపోతాయని వారు పేర్కొన్నారు . సత్వరమే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి కార్మికుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు . ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు మల్కా రామస్వామి, నల్ల మనోహర్ రెడ్డి , పిట్లగోపాల్ , రమేష్ మౌర్య , తంగడ అనిల్ రావు , ఆడెపు శ్రీనివాస్, అంజి కుమార్ తదితరులు పాల్గొన్నారు.