“నేను తప్పకుండా నా ఓటు హక్కు వినియోగించుకుంటా.. మరి మీరు! మన ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటరు జాబితాలో నా పేరు తనిఖీ చేసుకున్నా.. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈసారి నేను నా ఓటును సద్వినియోగం చేసుకోదల్చుకున్నా. కరీంనగర్ జిల్లాలో ఓటరునైనందుకు గర్విస్తున్నా.. ఈ నెల 30న నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా.” అనే కొటేషన్లతో ఎన్నికల అధికారులు వంద శాతం పోలింగ్పై దృష్టి సారించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఫ్లెక్సీలపై నినాదాలు రాయిస్తూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కూడళ్లు, జనావాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటితోపాటు కొత్తగా సెల్ఫీ పాయింట్లు కూడా పలుచోట్ల ప్రారంభించారు. ఓటు సింబల్కు చిహ్నమైన చేతి చూపుడు వేలును పోలిన గుర్తులు తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. వీటిలో యువతీ, యువకులు ఉండి సెల్ఫీలు దిగేలా రూపొందించి, జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
మొదటగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రారంభించిన సెల్ఫీ పాయింట్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఎనభై ఏళ్లు పైబడ్డ వృద్ధులు, 80 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న వారిని గుర్తించి, వారి కోసం ఓట్ ఫర్ హోమ్ కార్యక్రమం ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ రోజు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కొనసాగిస్తుండగా, ప్రైవేటు ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వీలు కల్పించింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు గత నెల 31వ తేదీ వరకు అవకాశమిచ్చింది. యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విద్యా సంస్థల్లో అవగాహన శిబిరాలు కూడా నిర్వహించింది.
వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో ఓటు హక్కు ఉపయోగంపై ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటర్లను ఆకర్షించేందుకు మోడల్ పోలింగ్ బూతులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, యువత కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అలాగే, పీఎస్లలో ఓటర్లకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నది. గతంలో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ బూతులను గుర్తించి, బీఎల్వోలతో ఇంటింటి ప్రచారం కూడా చేయిస్తున్నది. యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడంతో, మారుతున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి పోలింగ్ శాతం పెంచేందుకు విశేష కృషి చేస్తుండడం పట్ల జిల్లా ఎన్నికల యంత్రాంగంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏతావాతా వంద శాతం పోలింగ్ టార్గెట్తో ముందుకు సాగుతున్న ఎన్నికల అధికారులు లక్ష్యం సాధించేందుకు పోలింగ్ రోజు వరకు కష్టపడాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.