జగిత్యాల కలెక్టరేట్, జనవరి 20 : గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదుపై అవగాహనకు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం)లో భాగంగా జగిత్యాల జిల్లా మెరిసింది. రాష్ట్రస్థాయిలో రెండు బహుమతులు సాధించినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
జిల్లా కేంద్రానికి చెందిన గడ్డం బోగె అశోక్ దర్శకత్వంలో జానపద కళాకారుడు గడ్డం రమేశ్ బృందం పాడిన పాట, కొడిమ్యాల కస్తూర్బా విద్యార్థినులు ప్రదర్శించిన నాటికలకు వేర్వేరుగా మొదటి బహుమతులు దక్కాయని వెల్లడించారు. బహుమతులు పొందిన కళాకారులు, విద్యార్థినులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కాగా, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ కే లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు డీఆర్డీవో పీ నరేశ్, ఏపీడీ సుధీర్, హౌసింగ్ డీఈ రాజేశ్వర్, డీపీఆర్ఓ భీమ్కుమార్ కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.