రాంనగర్, అక్టోబర్ 31: క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున పాటించాల్సిన నియమాలు, చేపట్టే విధుల గురించి పలు సూచనలు చేశారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై, ఎన్నికల వేళ గొడవలు సృష్టించే వ్యక్తులపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సూచించారు. చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు.