Vemulawada | వేములవాడ, జూలై 21 : వేములవాడ రాజన్న ఆలయానికి అందజేసిన విరాళం వెనక్కి ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆలయ అధికారులను కలిసి విన్నవించిన వ్యవహారం మంగళవారం చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ చెందిన పసుల లక్ష్మీనారాయణ-జనాభాయ్ వృద్ధ దంపతులకు ఏడుగురు కూతుర్లు ఉన్నారు. అయితే సోమవారం భీమేశ్వర స్వామి దర్శించుకునేందుకు వచ్చి స్వామివారి నిత్య అన్నదాన సత్రానికి రూ.7 లక్షల1116లను సోమవారం రాజన్న ఆలయ నిత్యాన్నదాన సత్రానికి విరాళంగా అందజేశారు. అయితే విరాళం అందజేసిన విషయం తెలుసుకున్న కూతుర్లు మంగళవారం కార్యాలయం చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తల్లి జనాభాయితో కలిసి కూతుర్లు ఆయన మతిస్థిమితం బాగా లేదని ఇంట్లో రూ.లక్ష మాత్రమే విరాళం అందజేస్తామని చెప్పి తీరా ఆలయానికి వచ్చాక రూ.7 లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేనందున ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇంట్లో నయా పైసా లేదని అధికారులతో వాపోయారు. వృద్ధ దంపతులకోసం కనీసం మానవ కోణంలోనైనా విరాళంగా అందజేసిన డబ్బును తిరిగి ఇస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తామని కోరారు.
ఇకముందు కూడా నగదు, బంగారంతో వస్తే దయచేసి మాకు సమాచారం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆయననుండి ఎలాంటి విరాళాలు స్వీకరించవద్దని కూడా అధికారులను కోరారు. అయితే స్వామివారికి సమర్పించిన నగదు వెనక్కి ఇవ్వబడదని దానికి నిబంధనలు ఉంటాయని అధికారులు వారికి వివరించారు. వృద్ధ దంపతుల ఆరోగ్య అవసరాల కోసమైన నగదు ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు.