మంథనిరూరల్, మార్చి 21: మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గ్రామంలోని గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిలదీశారు. ప్రజలకు మంచినీరు అందించాల్సిన అధికారులే అడ్డదారుల్లో నీళ్లు రాకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి నియోజకవర్గంలో ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు ఇంకా ఎలా ఉన్నాయోనని మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యంతో వారం నుంచి నీళ్లు లేక సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారుగా 3వేల మంది ఉంటే.. ఎంత మందికి మంచినీరు అందిస్తున్నారో అధికారులు వెల్లడించాలన్నారు. ప్రజల కోసం పని చేసే అధికారులు మంచినీరు రాకుండా ఇలా నీచమైన పనులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
ఈ సందర్భంగా అధికారులు పలు వార్డుల్లో మంచి నీటి సరఫరాను పరిశీలించగా, గ్రామస్తులు వారి గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ.. ఎగ్లాస్పూర్ గ్రామంలో ప్రజలు పరిమితికి మించి మంచినీటిని వాడుతున్నారన్నారు. దీంతో దిగువన ఉన్న గ్రామాలకు మంచినీరు సరఫరా కావడం లేదన్నారు. రోజుకు 1.20లక్షల లీటర్ల నీటిని గ్రామానికి అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు సైతం మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.