Huzurabad | హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు. హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో చమక్ ఫౌండేషన్, హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ అజీమ్ అలీ మాట్లాడుతూ రూ.లక్షల విలువైన పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు. నేటి సమాజంలో గ్రంధాలయాల ఏర్పాటు చాలా ఆవశ్యకమని, నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలు నుంచి వృద్ధుల వరకు పుస్తక పఠనం తగ్గిపోయి సామాజిక మాధ్యమాలు, డిజిటల్ స్క్రీన్కి అలవాటు పడడంతో అవి ఒక వ్యసనంగా మారిందని పేర్కొన్నారు. పుస్తక పఠనం తగ్గిపోవడం వల్ల సృజనాత్మకత, విజ్ఞానం, సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన తగ్గిందని చెప్పారు. విద్యార్థులు అందరూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ, పుస్తకాలను పఠిస్తూ మంచి విద్యావంతులుగా ఎదగాలని కోరారు.
గ్రామ సర్పంచ్ అరుణ మాట్లాడుతూ చమక్ ఫౌండేషన్, హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ప్రారంభించడం మంచి శుభ పరిణామం అన్నారు. నేటి యువత విద్యార్థులు సావిత్రిబా పూలే , అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.
హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ తౌటం సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు. యువత తమ విజ్ఞానాన్ని తరగతి గదులకే పరిమితం చేయకుండా పుస్తకాలని పటిస్తూ సమాజంలో ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించడానికి కృషి చేస్తూ గొప్ప విద్యావంతులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బండి నరేష్. గ్రామస్తులు. విద్యార్థులు ఉన్నారు.