పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది. అది కూడా ఉద్యోగుల ఓటు ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో డ్యూటీ చేసేవారికి మాత్రమే అవకాశం ఇచ్చింది. లోక్సభ పరిధి దాటితే మాత్రం ఎప్పటిలాగే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉండగా, నూతన పద్ధతితో కరీంనగర్ జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం కలుగనున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేవారు. అందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేది. ఈసీ నిర్ణయించిన తేదీల్లో మాత్రమే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేవారు. అయితే, కొద్ది రోజులు మాత్రమే అవకాశమివ్వడంతో రోజూ వేలాది మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద బారులు తీరేవారు.
ఓపిక లేని వారు తమ ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయలేకపోతున్నట్లుగా గుర్తించిన ఈసీ, ఈసారి విధులు నిర్వర్తించే చోటనే ఓటు వేసే విధానానికి రూపకల్పన చేసింది. ఇలా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)తో ముందుగా ఫామ్-12ఏ భర్తీ చేసి సంబంధిత పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏఆర్వోకు నిర్ణీత గడువులోపు అందజేయాల్సి ఉంటుంది. తాము నిర్వహించబోయే ఎన్నికల విధుల వివరాలు, ఓటు హక్కు కలిగి ఉన్న శాసనసభా నియోజకవర్గం, గ్రామం, పట్టణం ఓటరు జాబితాలో తమ ఓటు వరుస సంఖ్య, తదితర విషయాలు స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిబ్బంది తమ ఓటు వినియోగించుకునేందుకు అనుమతిస్తారని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే మహేశ్వర్ తెలిపారు.
పార్లమెంట్ పరిధిలో ఎన్నికల విధులు, ఓటు హక్కు ఉన్నవారు పనిచేసేచోటనే ఓటు హక్కు కల్పిస్తుండగా, లోక్సభ పరిధి దాటితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కూడా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 12బీ ద్వారా అనుమతి కోరాల్సి ఉంటుంది. వీటిని ఆయా మండల కేంద్రాలు, సిబ్బందికి అందించే శిక్షణ సమయంలో స్వీకరించి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 200 పై చిలుకు సెక్టోరల్ అధికారులు, 8వేల పైచిలుకు పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే విధులు నిర్వహించే అవకాశముండగా, వీరందరికీ వారు విధులు నిర్వహించబోయే పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేసే అవకాశం కల్పించేందుకు యత్నిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.