ధర్మపురి, ఆగస్టు 30: ఉచిత చేపపిల్లల పంపిణీతో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేతినిండా పని కల్పించిందని, దీంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సమీకృత మత్స్య అభివృద్ధిలో భాగంగా బుధవారం ధర్మపురిలోని గోదావరి నదిలో వందశాతం సబ్సిడీతో అందించిన 80వేల చేపపిల్లలను గోదావరిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు గతంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో వారి బాధలు తీరాయన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపపిల్లల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్న ఉద్ధేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరాఫరా చేస్తున్నదన్నారు. డబ్బు పెట్టి చేపపిల్లలను పెంచే స్థోమత లేని వారికి వందశాతం సబ్సిడీ ఇచ్చి, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
పెద్దగా జలవనరులే లేని తెలంగాణ ప్రాంతంలో చేపలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయని, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకులు చులకన చేసి మాట్లాడరని వాపోయారు. నాటి పాలకుల కళ్లు బైర్లు కమ్మే విధంగా కేసీఆర్ సర్కార్ మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. జలయజ్ఞం ద్వారా అందుబాటులోకి వచ్చిన అనేక భారీ నీటిపారుదల, ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులు, కుంట ల అభివృద్ధి ద్వారా గ్రామాల్లో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం తదితర వనరులను మత్య్స రంగం అభివృద్ధికి వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ధర్మపురి వద్ద ఎల్లంపల్లి బ్యాక్వాటర్లో ప్రతీ సంవత్సరం ఆరు లక్షల చేపపిల్లలను విడుదల చేస్తున్నామని, మొదటి విడతగా 80వేల చేపపిల్లలను ధర్మపురి వద్ద గోదావరిలో విడుదల చేశామన్నారు. అంతకుముందు మంత్రి ఈశ్వర్ నేరెళ్ల గ్రామంలో 9లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించే మున్నూరుకాపు కులసంఘ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు తదితరులున్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఈశ్వర్ సమక్షంలో వెల్గటూర్ మండలం ముత్తునూర్కు చెందిన సుమారు వందమంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ పార్టీ కండువా కప్పి వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతూ, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని వారికి సూచించారు.