కార్పొరేషన్, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ సిటీల పోటీల్లో గతేడాది కంటే ముందు వరుసలో నిలిచేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. నగరంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించడంతో పాటు పారిశుధ్య పనుల నిర్వహణ, పరిశుభ్రత, ట్రాఫిక్ తదితర అంశాలను ఈ పోటీల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై కూడా కేంద్రం దృష్టిసారించి ర్యాంక్లను ప్రకటిస్తుంది. దీంతో పాటు నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో నగరవాసుల భాగస్వామ్యం విషయంలో అత్యధిక మార్కులు కేటాయించారు. ముఖ్యంగా నగరవాసులు ఈ పోటీల్లో తమ అభిప్రాయాలను తెలిపే విధంగా బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. తమ నగరంలో ఉన్న సౌకర్యాలు, వసతుల విషయంలో ప్రజలు ఆన్లైన్లో తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఎంత స్థాయిలో నగరవాసులు ఈ సర్వేలో పాల్గొంటారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మార్కుల కేటాయింపు ఉంటుంది. దీంతో నగరవాసులు అభిప్రాయాలను తెలిపే విధంగా బల్దియా అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
జోరుగా ప్రచారం
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ పోటీల్లో నగరవాసులందరూ తమ అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్న విషయంపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందుకోసం పారిశుధ్య విభాగం సిబ్బందితో పాటు ఇతర విభాగాల అధికారులు పనులు చేపడుతున్నారు. దీని కోసం పెద్ద సంఖ్యలో పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగానే వినియోగిస్తున్నారు. మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రతి సభ్యురాలు తమ అభిప్రాయం ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాలను నమోదు చేయించాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేస్తే నగరానికి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.