మల్యాల, జూలై 19: కొండగట్టును యాదాద్రి తరహాలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న సర్కారు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ఆలయానికి నిరంతరం నీరందించేందుకు చర్యలు చేపట్టింది. అధికారుల ప్రతిపాదనల మేరకు వరద కాలువ నుంచి ఎత్తిపోతల పథకానికి 13.43 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వరద కాలువ పక్కన పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి మోటర్ల ద్వారా నీటిని తరలించి సంతలోని లొద్ది వద్ద కుంటను నింపుతారు. అక్కడి నుంచి ఫిల్టర్బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి కొండగట్టు దిగువన నీటిసంపునకు పంపింగ్ చేయనున్నారు. అక్కడి నుంచి ఆలయ అవసరాలకు వినియోగిస్తారు. ఈ క్రమంలో ఎత్తిపోతల పథకం పనులకు గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వం కొండగట్టు అంజన్న ఆలయానికి నీరందించే విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ముత్యంపేటకు చెందిన పలువురు దాతలు కొండగట్టు ఆలయానికి నీరందించే సంతలోని లొద్ది(భూమిని) విరాళం ఇచ్చారు. ఇక్కడ కుంటను నిర్మించగా, నీటిని తరలించడం సాధ్యపడలేదు. దీని సామర్థ్యం 13.28 ఎంసీఎఫ్టీ. అయితే దీని ఆధారంగా అధికారులు పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ముత్యంపేట శివారులోని వరద కాలువ 81 కిలోమీటర్ మైలురాయి వద్ద ఒక పంప్హౌస్ను నిర్మిస్తారు. అక్కడ 150కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మోర్ల ద్వారా నీటిని ఎత్తిపోసి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతలోని లొద్దికి తరలిస్తారు. ఇటీవలే టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. ఈ పనులకు మంత్రి కొప్పుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఎం సుదర్శన్, మల్యాల సీఐ బిల్లా కోటేశ్వర్, ఇరిగేషన్ డీఈఈ తిరుపతి, ఏఈఈ వరాల వెంకట్ పరిశీలించారు.