జగిత్యాల, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేయగా, కోరుట్ల నియోజకవర్గం నుంచి తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గెలిచారు. ఆరోసారి చేసిన ప్రయత్నంలో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విజయాన్ని దక్కించుకున్నారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు, రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన జీవన్రెడ్డిపై బీఆర్ఎస్ అ భ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. గత నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను ఆదివారం మల్యాల మండలం నూకపెల్లి శివారులోని వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో లెక్కించారు. ఉదయం 8 గంటలకు జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం పోస్టల్ బ్యాలెట్లతో ఆరంభమైంది.
మొదటి 10 రౌండ్ల వరకు స్వల్పంగా ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి, 11వ రౌండ్ నుంచి చివరి రౌండ్ అయిన 19వ రౌండ్ వరకు వెనుకబడిపోయారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ 70,243 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి 54,421 ఓట్లను పొందారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి 42,138 ఓట్లను సంపాదించారు. మొత్తంగా 15,822 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ గెలిచారు. జగిత్యాల నియోజకవర్గంంలో 2,31,468 ఓట్లు ఉండగా, 1,76,369 ఓట్లు పోలయ్యాయి.
ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆరోసారి బరి లో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమా ర్ ఎట్టకేలకు విజయం సాధించారు. 2008లో తొలిసారి మేడారం రిజర్వ్డ్ నియోజకవర్గం నుం చి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అడ్లూరి లక్ష్మణ్కుమార్, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్పై ఓటమి చెందారు. 2009లో శాసనసభ స్థానాల పునర్విభజన తర్వాత ధర్మపురి ని యోజకవర్గం నుంచి మళ్లీ అడ్లూరి, కొప్పుల పో టీ పడగా, కొప్పుల ఈశ్వర్ రెండోసారి విజయం సాధించారు. 2010లో ఉప ఎన్నికలో వీరిద్దరే మరో సారి తలపడగా, వరుసగా ఈశ్వర్ మూడోసారి గెలిచారు.
2014లో నాలుగోసారి, 2018 లో ఐదోసారి సైతం ఇద్దరు పోటీ పడగా, కొప్పుల ఈశ్వర్ వరుసగా విజయాన్ని అందుకున్నారు. కాగా ఆరోసారి సైతం ఇద్దరు ధర్మపురి నియోజకవర్గ బరిలో నిలువగా ఈ సారి మాత్రం అడ్లూరి లక్ష్మణ్కుమార్ విజయాన్ని అందుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 91,393 ఓట్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్కు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్కు 69,354 ఓట్లు వచ్చాయి. 22,039 ఓట్ల మెజార్టీతో అడ్లూరి విజయం సాధించారు. నియోజకవర్గంలో 2,26,880 ఓట్లు ఉండగా, 1,81,690 ఓట్లు పోలయ్యాయి.
కోరుట్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయాన్ని దక్కించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్రావు వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడంతో తన కొడుకు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలోనే డాక్టర్ సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సంజయ్కు 72,115 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా నిలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు 61,810 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జువ్వాడి నర్సింగరావుకు 39,647 ఓట్లు దక్కాయి. డాక్టర్ సంజయ్ 10305 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. నియోజకవర్గంలో 2,40,855 ఓట్లు ఉండగా, 1,83,590 ఓట్లు పోలయ్యాయి.