ఓదెల, ఫిబ్రవరి 23 : నాడు ఓదెల మండలంలోని మడక నుంచి గుంపుల గ్రామాల మధ్యన సింగిల్ రోడ్డు అధ్వానంగా ఉండేది. 12కిలోమీటర్ల రోడ్డుపై అడుగుకో గుంతతో 10నిమిషాల ప్రయాణం 30 నిమిషాలకుపైనే పట్టేది. ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చేది. కానీ, స్వరాష్ట్రంలో ఈ రోడ్డు దశ మారుతున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చొరవతో డబుల్ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఎఫ్ నిధులు 16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, గత డిసెంబర్ 13న మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు.
అప్పుడే పనులు ప్రారంభం కాగా, బుధవారం నుంచి డబుల్ రోడ్డుకు తారు వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం చేస్తున్నారు. నాడు ఎన్నో కష్టాలు పడ్డామని, ఇకపై ఇబ్బందులు తొలగుతాయని చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సర్కారు రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిందని, రోడ్లు అద్దాల్లా మారాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చెప్పారు. మడక-గుంపుల రోడ్డులో ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటుందని, అందుకే ఆ రోడ్డును డబుల్ మారుస్తున్నామన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.