సిరిసిల్ల రూరల్, నవంబర్ 23: డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారులను ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని బ్లూకోల్స్, పెట్రోకార్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడు తూ, నేరాల నియంత్రణకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తదితర నేరాలపై డయల్ 100కి కాల్ వస్తే వెంటనే స్పందించాలన్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న క్రిమినల్స్ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్ వర్టికల్ ఇన్చార్జి సీఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.