మంథని, జూలై 4: ‘ప్రపంచ చరిత్రలో అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకు నిలయం తెలంగాణ. అలాంటి పోరాటయోధులు, మహనీయులను గుర్తించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయేలా మహోన్నతమైన స్థానాన్ని తెలంగాణ సర్కారు ఇచ్చింది’ అని రాష్ట్ర మీడియా ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మంథని నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో కామ్రెడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్తో కలిసి ఆవిష్కరించి, మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను మొదలుకొని సమాజానికి మేలు చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని ప్రభుత్వం వారి వర్ధంతులు, జయంతులను అధికారంగా నిర్వహించి ఆయా జాతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా పని చేస్తున్నదన్నారు.
దొడ్డి కొమురయ్య త్యాగం గొప్పదని కొనియాడారు. సాదులు, సన్యాసులతో ఉపయోగం లేదని, జ్ఞానులు, విజ్ఞాన వంతులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోకి మనువు, సాదువులు, సన్యాసులను తీసుకెళ్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కొంత మంది కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి నాటి రోజులు రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం విధానాలకు పూర్తి వ్యతిరేకంగా మంథనిలో ప్రగతి జరుగుతున్నదన్నారు. భవిష్యత్తు తరాలకు మహానీయుల చరిత్ర తెలియజేసేలా కుల, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ బహుజన వాదాన్ని బలపరుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మంథని నియోజకవర్గంలో బహుజన వాదం మరింత బలోపేతం కావాలన్నారు. మంథనిలో చాకలి ఐలమ్మ, ఏకలవ్య, పీవీ నరసింహారావు, దొడ్డి కొమురయ్యలతో పాటు అనేక మంది మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి ఆనంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, పర్శ బక్కయ్య, ఆకుల కిరణ్, కుర్రు లింగయ్య పాల్గొన్నారు.
మహనీయుల చరిత్ర తెలియజేసేందుకే..
మహనీయుల స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వారి చరిత్రను అందరికీ తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. మహనీయులు వందేళ్ల క్రితమే మన భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేశారు. కానీ ఈనాడు అధికారం, ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా కొందరు నాయకులు పని చేస్తున్నారు. బాబు జగ్జీవన్ రామ్, ఆదివాసీ బిడ్డ కొమురం భీం, గుడిసెల వెంకటస్వామి, బీపీ మండల్ లాంటి మహానీయుల విగ్రహాలను మంథనిలో ఏర్పాటు చేసిన ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుంది. త్వరలోనే ప్రొఫెసర్ జయశంకర్సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. 40 ఏండ్లు ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదు. తన తండ్రి విగ్రహాలు పెట్టి మొక మన్నారే కానీ మహానీయుల గురించి చెప్పలేదు. అధికారం, పదవుల కోసం పరితపించే నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు.
– జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
కుల,మతాలకతీతంగా విగ్రహాలు
మహనీయుల చరిత్రను భావితరాలకు కండ్లకు కట్టినట్లు చూపించేందుకు కుల, మతాలకతీతంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కలిసి మంథనిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం. విగ్రహాల ఏర్పాటే కాదు వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంథనిలో అనేక విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత పుట్ట దంపతులకే దక్కుతుంది. అనేక ఏండ్లు అభివృద్ధికి దూరమైన ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం ఎంతో కృషిచేస్తున్నారు.
– బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి ఎంపీ
ఆనందంగా ఉంది..
ప్రాంత ప్రజలకు పోరాట యోధుల పటిమ, వారు మన కోసం చేసిన త్యాగాలను తెలియజెప్పేందుకే మంథనిలో విగ్రహాలను ఏర్పాటు చేయిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంథనిలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరైనందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– పుట్ట శైలజ, మున్సిపల్ చైర్ పర్సన్ (మంథని)