ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు వైద్య సేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో తమతో ప్రైవేట్ వైద్యులు పోటీ పడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన ఐఎంఏ 6వ రాష్ట్ర స్థాయి సదస్సు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి హాజరై, మాట్లాడారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, వీలైనంత త్వరలోనే ప్రభుత్వ వైద్యంలో అనేక మార్పులు చూడబోతున్నారని చెప్పారు. ప్రైవేట్ వైద్యశాలలకు సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు ఒకే చోట, ఒకే సారి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ బీఎన్ రావు, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
కరీంనగర్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ)/విద్యానగర్: సమాజంలో వైద్యులకు గౌరవమైన స్థానం ఉన్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన ఐఎంఏ 6వ రాష్ట్ర స్థాయి సదస్సు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని కోరారు.
ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో తమతో ప్రైవేట్ వైద్యులు సర్కారుతో పోటీ పడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలల్లో సీనియర్ వైద్యులకు మంచి అవకాశాలు ఏర్పడబోతున్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్రొఫెసర్లుగా సేవలందించేందుకు ప్రైవేట్ వైద్యులు ముందుకు రావాలని, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా నేరుగా రిక్రూట్మెంట్ ఉంటుందని హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినడిన తొలినాళ్లలో హైదరాబాద్లో రెండు, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో ప్రభుత్వ మెడికల్ కళాశాల చొప్పున కేవలం ఐదు మాత్రమే ఉండేవని రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో ఇప్పుడు 12 మెడికల్ కళాశాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఒక్కోదానికి 150 సీట్లు మంజూరు చేశామని వివరించారు. మంచిర్యాల జిల్లాలో 10 లక్షల జనాభాకంటే తక్కువ ఉన్నదనే నెపంతో ఎన్ఎంసీ కొరివి పెట్టి 100 సీట్లకే అనుమతి ఇచ్చిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు కేవలం 5 మెడికల్ కళాశాలు మాత్రమే ఉంటే తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలో 12 మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసుకున్నామని, గతంలో 2,790 సీట్లు ఉంటే ఇప్పుడు 6,615 సీట్లు పెరిగాయని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మన దేశం నుంచి ఉక్రెయిన్, చైనా, రష్యా, పిలిప్పిన్స్ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఉందని, స్థానికంగానే వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఎన్ఎంసీ విధానాలు సరిగ్గాలేక అనుమతులు సులభంగా అందడం లేదన్నారు.
అడ్మిషన్లు జరిగిన తర్వాత రాష్ట్రంలోని మూడు మెడికల్ కళాశాలల అనుమతులు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ కళాశాలల విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తనను ప్రతి రోజూ అడుగుతున్నారని చెప్పారు. ఒక ప్రైవేట్ దవాఖానను ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు ఒకే చోట, ఒకేసారి లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కొత్త మెడికల్ కళాశాల కారణంగా ఎంబీబీఎస్ సీట్లతోపాటు పీజీ సీట్లు రెట్టింపు సంఖ్యలో పెరిగాయన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన (సీనియర్ రెసిడెన్స్)ఎస్ఆర్లకు గతంలో పట్టణ ప్రాంతాల్లోనే డ్యూటీలు వేసేవారని, ఇపుడు మారుమూల ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారని, ఈ విషయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లో వాళ్లకు డ్యూటీలు వేయాల్సి వచ్చిందని, ఈ క్రమంలో వేతనాలు పెంచి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎంబీబీఎస్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించినవారికి పీజీలో 30 శాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు.
వైద్యులు అంటే సమాజంలో ఎంతో గౌరవమైన హోదా ఉంటుందని, అయితే కొన్ని విషయాల్లో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాల విషయంలో రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రంలో 60.7 శాతం సీ సెక్షన్లే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వందకు 44 శాతం సీ సెక్షన్ జరుగుతుండగా అదే ప్రైవేట్ దవాఖానల్లో అయితే వందకు 81 శాతం ఈ పరిస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేట్ దవాఖానలు వందకు వంద శాతం సీ సెక్షన్లవైపే మొగ్గుచూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో ఒక్కసారి అందరం ఆలోంచించాల్సిన అవసరం ఉందన్నారు. బీబీనగర్లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్లో కనీసం ల్యాబ్లు బ్లడ్ బ్యాంకులు, లేబర్ రూంలు కూడా లేక పోవడంతో మెడికోలు నష్టపోతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైద్యంలో అనేక మార్పులు చూడబోతున్నారని, ఇప్పటికే హైదరాబాద్ నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలను రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, వరంగల్లో రూ.1,200 కోట్లతో మరొకటి ఏర్పాటు చేస్తున్నామని, పీజీ, నర్సింగ్ కళాశాలల్లో సూపర్ స్పెషలైజేషన్ కోర్సులు ఉండే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి 56 రకాల పరీక్షలు నిర్వహించి రోగుల మొబైల్ ఫోన్లకే సమాచారం అందించే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో ప్రధాన దవాఖానలపై ఓపీ ఒత్తిడి తగ్గిందన్నారు. ఇంతకు ముందు 900 పల్లె, బస్తీ దవాఖానలు ఉండగా ఇప్పుడు మరో 2,900 ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విద్యా వ్యవస్థకు బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయడం లేదని కొందరు అపోహ పడుతున్నారని, అన్ని రంగాల్లో ఉన్నత విద్య కోసం చేసే ఖర్చును వారు చూడడం లేదన్నారు. త్వరలో 950 డాక్టర్ పోస్టులు, 1,150 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.
డాక్టర్ బీఎన్ రావు ప్రమాణ స్వీకారం
ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ బీఎన్ రావు, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు నుంచి బీఎన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మేయర్ వై సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, సదస్సు ఆర్గనైజర్లు, వైద్యులు పీ రాంకిరణ్, ఝాన్సీ, లక్ష్మణ్కుమార్, లక్ష్మీనారాయణ, రవీందర్రెడ్డి, అలీమ్, చెన్నాడి జగన్మోహన్రావు, బంగారి స్వామి, రజని, విజయలక్ష్మి, ఆది శ్రీదేవి, ప్రదీప్ కుమార్, వెంకట్రెడ్డి, మన్నె ప్రవీణ్కుమార్, అరుణ్ కటారి, నవీణ, పద్మ, రంజిత్ కుమార్, తదితరులు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఐఎంఏ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పొరండ్ల కిషన్ రూపొందించిన సావనీరును మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు ఆవిష్కరించారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యత
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలు ఏర్పాటు చేస్తున్నాం. మారుమూల భూపాలపల్లి, నారాయణపేట, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటవుతాయని కలలో కూడా అనుకోలేదు. హైదరాబాద్లో ఐఎంఏకు హాల్ నిర్మించేందుకు నేను, హరీశ్రావు సీఎం కేసీఆర్తో మాట్లాడతాం. 30-40 గదులు సహా మంచి హాల్ నిర్మించుకునే విధంగా కృషి చేస్తాం. వైద్యులపై దాడులు అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించండి
ప్రజల ఆరోగ్యానికి వైద్యులు భద్రత కల్పిస్తే వైద్యుల భద్రత మేం చూసుకుంటాం. వైద్య వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. రెండేళ్ల కింద దేశంలోనే మొదటిసారి కరీంనగర్లో 10 కరోనా కేసులు బయటపడినప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు చూపిన తెగువ, అందించిన సేవలు అనిర్వచనీయమైనవి. కరీంనగర్ జిల్లాలో రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉండగా మరో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్కు, ప్రతిపాదించిన మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. జిల్లాలో 400కు పైగా ప్రైవేట్ దవాఖానలు ఉంటే ఒక్క కరీంనగర్లోని 350 వరకు ఉన్నాయి. దాదాపు వెయ్యి మంది వైద్యులు ఎనలేని సేవలు అందిస్తున్నారు.
– రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
ఐఎంఏలో సభ్యత్వం పొందాలి
ప్రతి వైద్యుడు, వైద్యురాలు ఐఎంఏలో సభ్యత్వం పొంది, వైద్యుల ఐక్యతకు కృషి చేయాలి. ఎప్పటికపుడు సీఎంఈలను ఏర్పాటు చేసి వైద్య రంగంలో వస్తున్న నూతన పద్ధతులను వృత్తిలో మెరుగు పర్చుకోవాలి. తెలంగాణలో ఐఎంఏ శాఖ బలంగా ఉంది. బీఎన్ రావు బృందాన్ని అభినందిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్యానికి ప్రత్యేక చొరవ చూపుతున్నది..
– డాక్టర్ సహజానంద్ ప్రసాద్సింగ్, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు
దవాఖానల ఏర్పాటుకు సహకరించాలి
దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలి. కొన్ని కఠినతరమైన నిబంధనలను సడలించాలి. మున్సిపల్, ఫైర్, పొల్యూషన్ బోర్డుల అనుమతుల కోసం ఇబ్బందులకు గురవుతున్నాం. వైద్యులపై దాడుల నివారణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని మంత్రి హరీశ్రావును కోరుతున్నా.
– డాక్టర్ శరత్కుమార్ అగర్వాల్, ఐఎంఏ జాతీయ ఎలెక్ట్ అధ్యక్షుడు
చిన్న దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కల్పించాలి
చిన్న దవాఖానల్లో కూడా ఆరోగ్య శ్రీకి అవకాశం కల్పించాలి. దీనివల్ల పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందే అవకాశం ఉంటుంది. నేషనల్ ఐఎంఏలో ఉచితంగా సభ్యత్వం కల్పించాలి.
– డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడు